కేంద్రంపై చిరాకు: రెండున్నర గంటలు బస్సులోనే ఉండిపోయిన బాబు
శ్రీకాకుళం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్రం చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపించారు. రెండేళ్లు మభ్య పెట్టి మొండిచేయి చూపడం పట్ల ఆయన అసహనానికి కూడా గురైనట్లు చెబుతున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన అన్యమనస్కంగా ఉన్నట్లు కనిపించారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం చేరుకున్న చంద్రబాబు మూడు గంటల వరకూ తన ప్రత్యేక బస్సులోనే ఉండిపోయారు. అది భోజన విరామసమయమని మంత్రులు చెప్పినా ఢిల్లీలోని పార్టీ ఎంపిలతో చర్చల్లోనే చంద్రబాబు మునిగిపోయారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలు, సభల్లో బాబు అన్యమనస్కంగానే ప్రసంగించారు.
నీరు-చెట్టు పనుల పరిశీలన, పంటసంజీవిని ప్రారంభ కార్యక్రమాల్లో బాబు ప్రసంగాలు ఆయన స్వరానికి తగ్గట్టుగా లేవనే మాట వినిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడిరామ్మూర్తి స్టేడియం చేరుకున్నారు. కేంద్రం ఇచ్చిన షాక్ నుంచి బయటపడలేకపోయారు.

వేదికపై నుంచి ఆయన చేసిన ప్రసంగం అంత వేడిగా సాగలేదు. చెప్పిందే చెబుతూ ఒకే అంశాన్ని ప్రస్తావిస్తూ సాగదీయడ కనిపించింది. 'ప్రత్యేకహోదా'పై కేంద్రం ప్రకటన తెప్పించిన చిరాకు వల్లనే అలా జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ పెద్దలు, ఎంపితో ప్రత్యేకహోదా అంశంపై బాబు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
విభజన చట్టంలో పొందుపర్చిన హామీల పరిష్కారం కోసం ఇప్పటి వరకూ 20 సార్లుకుపైగా ఢిల్లీకి కాళ్లరిగేలా వెళ్ళినా ఫలితం దక్కలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలోని సప్తగిరి ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా పార్టీ సర్వసభ్యసమావేశంలో సిఎం ప్రసంగిస్తూ విభజన సమస్యలను కేడర్కు వివరించారు.
ఆస్తులు తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలా మనగలుతుందని ప్రశ్నించారు. ఆస్తులు సమానంగా పంచాలని పదో షెడ్యూల్లో విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో అదే అన్నింటికీ వర్తిస్తుందని అన్నారు. తలసరి ఆదాయం తక్కువగా, అప్పులు ఎక్కువుగా ఉన్నప్పటికీ సంకల్పబలంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications