రావెల-జానీమూన్ మధ్య రాజీ అంతేనా?: బాబు ఆగ్రహం, జగన్కు ఛాన్స్
మంత్రి రావెల కిషోర్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లు ప్రకటించినా, అవి కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
గుంటూరు: మంత్రి రావెల కిషోర్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లు ప్రకటించినా, అవి కొనసాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
జైట్లీ వెళ్లే సమయం చూసుకొని వెంటపడిన సుజనా చౌదరి!
నేతల విభేదాల పైన చంద్రబాబు ఆగ్రహం చల్లారలేదని అంటున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరులో విలేకరుల సమావేశంలో వివాదం సమసిపోయిందని మంత్రి రావెల, చైర్ పర్సన్ జానీమూన్ ప్రకటించారు.
కానీ చంద్రబాబు మాత్రం వారి తీరుపై సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తదితరులు చర్చలు జరిపి వారి మధ్య విభేదాలు సమసిపోయాయని ప్రకటింప చేశారు.
అయితే, వారిద్దరూ విలేకరులతో మాట్లాడడం కంటి తుడుపు రాజీగా చంద్రబాబు కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి చర్యలు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని, తేలిగ్గా వదిలేది లేదని ముఖ్య నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఇలాంటి ధోరణులకు ఒకేసారి ఫుల్స్టాప్ పెట్టాలన్నారు. ఈ వివాదంపై విచారణ కోసం నియమించిన త్రిసభ్య కమిటీ తన పని తాను చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలతో నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
రావెలతో సయోధ్య: వదలను కానీ.. జానీమూన్, మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
కాగా, పార్టీలోని చిన్న చిన్న విభేదాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దవిగా చేసి చూపించే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పత్తిపాటి విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయనేది కంటితుడుపు చర్యే అని చంద్రబాబే భావించడం ద్వారా.. జగన్కు మళ్లీ ఛాన్స్ దొరికిందని అంటున్నారు.