చంద్రబాబు, వెంకయ్య సెటైర్లు: సిపిఐ నారాయణ వివరణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పుస్తక మహోత్సవ సంఘటనలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడే నారాయణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదికను పంచుకున్నారు.
వారిద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. వారి మధ్యలోకి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు పోటీ పడి నారాయణపై సరదాగా సైటైర్లు వేశారు.

వెంకయ్య అలా నవ్వించారు..
వెంకయ్య నాయుడు తన మాటలతో, ప్రాసలతో నారాయణపై తనదైన శైలీలో మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. ఈ సన్నివేశం విజయవాడ పుస్తక మహోత్సవంలో జరిగింది. వెంకయ్య నాయుడు నారాయణపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

చంద్రబాబు వ్యాఖ్య ఇదీ...
విశాలాంధ్ర పుస్తకాలు చదివి నారాయణ ఇలా అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు వేసిన పుస్తకాలు వారే చదువుతారంటూ వెంకయ్యనాయుడు నారాయణను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఆ సమయంలో నారాయణ భుజంపై చంద్రబాబు చేయి వేసి అభినందించారు.

నారాయణ స్పందన ఇదీ..
విద్యార్ధి దశ నుంచి తాము ముగ్గురం పరిచయస్తులమని, వ్యక్తిగతంగా తాము సన్నిహితంగా పరిచయం ఉన్న వాళ్లమని, తమ మధ్య రాజకీయ విభేదాలు ముక్కోణాలుగా ఉంటాయని, విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు మా అభిప్రాయాలు రైలు పట్టాల్లా ఉన్నాయని నారాయణ అన్నారు. ఎప్పుడూ కలిసే ప్రసక్తి లేదని కూడా అన్నారు.

టిడిపితో కలిశాం గానీ...
కొన్ని సందర్భాల్లో అయితే తాము తెలుగుదేశం పార్టీతో కలిశాం గానీ బీజేపీతో మాత్రం కలవలేదని నారాయణ చెప్పారు. తమ మధ్య విమర్శలు వాడీవేడిగా ఉన్నా ఎక్కడ కలిసినా బాగా మాట్లాడుకుంటామని చెప్పారు. తాను చదివే పుస్తకాలు వేర,. వాళ్లు చదువుకునే పుస్తకాలు వేరని అన్నారు. వారి భావాలు వేరు, తన భావాలు వేరుని, కానీ తాము కలుసుకున్నప్పుడు మాత్రం బాగా మాట్లాడుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications