కెసిఆర్! ఎవర్ని బెదిరిస్తున్నవ్.. జాగ్రత్త, ఉరికిస్తాం: బాబు
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా గజ్వెల్ సభలో చండ్ర నిప్పులు చెరిగారు. గజ్వెల్ టిడిపి అభ్యర్థి కెసిఆర్ను పరుగు పెట్టిస్తారన్నారు. గజ్వెల్ నుండి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కెసిఆర్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతాప్ రెడ్డి ఉక్కు మనిషి అన్నారు.
కెసిఆర్ ఎవర్ని బెదిరిస్తున్నావ్, నా దగ్గర బతికావ్, నా దగ్గర పైకొచ్చావ్, ఎవడో ఒకడు వస్తే నేను భయపడతానా అన్నారు. తెలుగు తమ్ముళ్లు పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కెసిఆర్ తాత జాగీరు కాదన్నారు. బిసి నేత కృష్ణయ్యను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే దాడి చేస్తావా అని ప్రశ్నించారు. కృష్ణయ్య అనుకుంటే కెసిఆర్ తెలంగాణలో ఉండడన్నారు. ప్రతాప్ రెడ్డి తల్చుకుంటే కెసిఆర్ను గజ్వెల్ నుండి ఉరికిస్తాడని, గోదావరిలో పడతావన్నారు.
మోడీ దుష్మనా, నన్ను జైల్లో పెడతావా, ఎవరిచ్చారు నీకు అధికారమని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ ప్రభుత్ం, రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం ఖాయమన్నారు. కెసిఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాసుపత్రికి పంపిస్తానన్నారు. ఆయన మెదడు కరాబయిందని, బ్యాలెన్స్ లేదన్నారు. మీ ఇంటికి ఐదు ఉద్యోగాలు కావాలి, తెలంగాణ తమ్ముళ్లకు వద్దా అని ప్రశ్నించారు. ఇదే దొరల పాలన అన్నారు. దొరలకే టిక్కెట్లు ఇచ్చారన్నారు.
తమను కెసిఆర్ మోసం చేశారని సోనియా ఆదివారమే చెప్పారని, కెసిఆర్కు ఓటేస్తే రేపు ప్రజలను కూడా మోసం చేస్తారన్నారు. తాను మొండి మనిషినని, తన పట్టు ఉడుంపట్టు అన్నారు. కెసిఆర్ను ఉరికెత్తించే వరకు ఆగేది లేదన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన పోయే వరకు తాను వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎకరా భూమిలో కోటి రూపాయలు ఎలా వస్తాయో చెప్పాలన్నారు. కెసిఆర్ను ఓడించేందుకు ఒక్కో తమ్ముడు కొండవీటి సింహంలా, బెబ్బులు బులిలా కావాలన్నారు. నీచమైన కెసిఆర్ను చిత్తుగా ఓడించాలన్నారు.
తన మీటింగులోనే ఓ కార్యకర్త వచ్చి ఇలా చేశారంటే... కెసిఆర్ గెలిచాక, ఆయన ఇంటికి వెళ్తే మీ పరిస్థితేమిటన్నారు. పవన్ను ముక్కలు చేస్తావా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఒక్క రోజు లేచి, మూడు రోజులు పడుకుంటాడని ఎద్దేవా చేశారు. తాగకుండా ఉండలేడన్నారు. కెసిఆర్ పని అయిపోయిందన్నారు. తనతో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడలేదన్నారు. ఎన్టీఆర్తో పెట్టుకొని ఇందిర, తనతో పెట్టుకొని వైయస్ అయిపోయారన్నారు.
ఇప్పుడు కెసిఆర్ తనతో పెట్టుకుంటున్నారన్నారు. కెసిఆర్! ఖబడ్తార్.. ఎవరితోనైనా పెట్టుకో.. నాతో మాత్రం వద్దన్నారు. కెసిఆర్ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఎవరైనా ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారా అంటే అది కెసిఆర్ మాత్రమే అన్నారు. కెసిఆర్ పిరికిపందగా ప్రవర్తించవద్దన్నారు. తెరాసకు తెలంగాణలో విఆర్ఎస్ ఇద్దామన్నారు. ఈ తెలంగాణ గడ్డ పైన తెరాస ఉండటానికి వీల్లేదన్నారు. పోలీసులు తమ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.