ఏంటిది! బ్లాక్ లిస్ట్లో పెడతాం: కాంట్రాక్టర్లపై బాబుకు కోపమొచ్చింది
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు కోపం వచ్చింది. ఈ పనులు ఏమిటంటూ కాంట్రాక్టర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన పనులు చేస్తే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లుగా ఉండాలన్నారు.
చంద్రబాబు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెన్నా బ్యారేజీ పనుల విషయంలో నాణ్యతా లేమి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేశారు.
నిధులను సకాలంలో కేటాయిస్తున్నప్పటికీ, పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. ఇకపై ఇటువంటివి చూసీ చూడనట్టు వదిలేసేది లేదన్నారు. ముందుగా అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అంతకుముందు చంద్రబాబు.... కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యం కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
పొల్లూరు మండలంలో చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు నవంబర్ 1వ తేదీన గుంటూరు జిల్లా పొల్లూరు మండలంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. మండలంలోని మునుకుటూరు గ్రామంలో నిర్వహించ తలపెట్టిన మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా సభ నిర్వహించే ప్రదేశాన్ని, హెలిప్యాడ్లను కలెక్టర్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం మునుకుటూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.