హోదా తేల్చుతారా, లేదా? నమ్మితే ఇలాగేనా: బిజెపికి బాబు గట్టి వార్నింగ్!
విజయవాడ: ప్రత్యేక హోదా పైన ఏపీలో ఉద్యమం రాజుకుంటోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రులు భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తదితరులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని, లేని పక్షంలో రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదని వారితో చెప్పారని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
హోదా ఇవ్వకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోందని, రాజకీయంగా ఇరువురం నష్టపోతామని చంద్రబాబు ఒకింత గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా పైన రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులతో చంద్రబాబు విజయవాడలో భేటీ అయ్యారు.
ఎలాంటి వ్యూహం అనుసరించాల్సిందన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లతో బాబు వేర్వేరుగా మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాతోను మాట్లాడారు.
విభజన తర్వాత ఏపీకి కష్టాలున్నాయని భావించి వాటి నుంచి బయటపడేస్తారని మీకు, మాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పటికీ ఆ కష్టాలు అలాగే ఉన్నాయని, ఇది కొనసాగటం మంచిది కాదని, రాజకీయంగా ఇరువురికి నష్టదాయకమని వారికి వివరించారు. హోదాతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనన్నారు.
చంద్రబాబు మరింత కటువుగా మాట్లాడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. హోదా పైన కాదంటే చెప్పాలని, తమ దారి తాము చూసుకుంటామని వ్యాఖ్యానించినట్లుగా కూడా చెబుతున్నారు.
ఏం చేశారని మీ హామీలను నమ్మాలని, జనం మనల్ని నమ్మి గెలిపించారని, పరిస్థితి ఆత్మాహుతి దాకా వచ్చిందని, ఏడాది పాటు ఎంతో ఓపిక పట్టామని, ఇక మేం సర్ది చెప్పలేమన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రులు సర్ది చెప్పినప్పటికీ చంద్రబాబు శాంతించలేదని అంటున్నారు.