Chandrababu: కేబినెట్ భేటీలో మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక..!
ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. త్వరలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో ఓ కీలక అంశంపై సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత జరిగే టేబుల్ ఐటమ్ చర్చలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఇందులో రాష్ట్రంలో తాజాగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఉచిత ఇసుక ఎలా సరఫరాఅవుతోందన్న దానిపై మంత్రులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. అనంతరం విమర్శలు రాకుండా చూసుకోవాలని కోరారు. ఇసుక సరఫరాలో జోక్యం చేసుకోవద్దని మంత్రులను చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉచిత ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని వారికి సూచించారు.

అక్టోబర్ తర్వాత రాష్ట్రంలో ఇసుక క్వారీలు అందుబాటులోకి వస్తాయని మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అలాగే బోట్ సొసైటీలకు కూడా అనుమతిస్తామని తెలిపారు. ప్రస్తుతం డంప్ యార్డుల్లో ఉన్న 43 టన్నుల ఇసుకతో పాటు రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నదుల్లో పూడిక తీత, బోట్ సొసైటీల తవ్వకాల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక సమకూరుతుందన్నారు. మరోవైపు ప్రతీ మంత్రీ తమ శాఖలపై నెలలవారీ సమీక్షలు నిర్వహించడం ద్వారా పట్టు పెంచుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు మరోసారి సూచించారు.












Click it and Unblock the Notifications