ఉద్వాసన తప్పదు: విభేదాలపై మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక
విశాఖపట్నం: మంత్రులు అంతర్గత విభేదాలకు స్వస్తి చెప్పకపోతే ఉద్వాసన తప్పందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో కార్యకర్తలతో ఆయన బుధవారంనాడు సమావేశమయ్యారు.
మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడులను ఉద్దేశించి చంద్రబాబు ఆ హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలతో కూడిన చంద్రబాబు వ్యాఖ్యలకుకార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన చూసైనా పద్ధతులను మార్చుకోవాలని బాబు మంత్రులను కోరారు.
తగాదాలు రాకుండా ఉండాలనే వేర్వేరు నియోజకవర్గాలు కేటాయించానని బాబు పేర్కొన్నారు. అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావు మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు వారి మధ్య వివాదం చంద్రబాబు దాకా వచ్చింది. అయినా వారి మధ్య సామరస్యం నెలకొనడం లేదు. ఈ స్థితిలో చంద్రబాబు ఆ హెచ్చరికలు చేసినట్లు కనిపిస్తోంది. మంత్రుల మధ్య విభేదాలను కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు.
కాగా, రాష్ట్ర రాజధాని విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు తమను ఇబ్బంది పెట్టాలని చూశాయని, తమను ఇబ్బందులు పెట్టాలని అనుకున్నవారే ఇవాళ ఇబ్బందుల్లో పడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. హుధుద్ తుఫాను సమయంలో పార్టీ కార్యకర్తలు విశేషమైన కృషి చేశారని ఆయన ప్రశంసించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను రాబడుతానని ఆయన చెప్పారు. ప్రస్తుత స్తితిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పదేళ్లుగా పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు ఆపార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. దళితులు తమ అభివృద్ధి ఫలాలను పొందడంతోపాటు వ్యాపార రంగంలోనూ రాణించాలని ఆకాంక్షించారు. 12 నెలల్లో రాజధాని అభివృద్ధి చూస్తారన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీల నిధులతో కాంగ్రెస్ నేతలు ఖరీదైనకార్లు కొన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ రూ.18 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయించిందని మంత్రి రావెల అన్నారు.