ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు: మోడీ ముందే నిరసన తెలుపుతారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ బయల్దేరారు. ఆయన వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామృష్ణుడు కూడా వెళ్లారు.
ఆదివారం సమావేశం కోసం 24 పేజీల సమగ్రనివేదికను చంద్రబాబు సిద్ధం చేశారు. జీఎస్టీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల అమలుకు పట్టుబట్టనున్నట్లు సమాచారం.
రాష్ట్ర సమస్యలను ప్రస్తావించే అవకాశం ఇవ్వకుంటే నిరసన తెలిపే అవకాశం ఉందని యనమల తెలిపారు. ఆయా రాష్ట్రాలకు సమస్యలు తెలిపే అవకాశం ఇవ్వాలని అన్నారు. కేంద్రానికి అనుకూలంగా సమావేశ అజెండా తయారు చేశారన్నారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని ముందే చంద్రబాబు నిరసన తెలిపే అవకాశం ఉంది. అంతేగాక, ఈ పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న నిరసనకు కూడా చంద్రబాబు మద్దతు తెలిపే అవకాశం ఉంది. బీజేపీయేతర సీఎంలు, జాతీయ పార్టీల నేతలను కలిసే అవకాశం కూడా ఉంది. కేంద్రం తమకు చేస్తున్న అన్యాయంపై చంద్రబాబు మద్దతు కూడగట్టనున్నారు.