విశ్రాంతి కోసం ఫ్యామిలీతో గోవాకు చంద్రబాబు
హైదరాబాద్: గత కొంతకాలంగా అవిశ్రాంతంగా నిత్యమూ పర్యటనలు, సమీక్షలతో తీవ్ర పని ఒత్తిడి మధ్య పాలన కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాస్త విశ్రాంతిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, రెండు రోజుల విశ్రాంతి నిమిత్తం గోవా పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం నాడు కుటుంబంతో సహా గోవాకు వెళ్లే ఆయన, తిరిగి వినాయక చవితి పర్వదినం నాడు తిరిగి వస్తారని సమాచారం.
గత రెండు రోజులుగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన, కర్నూలు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. గురువారం కూడా అక్కడే గడపనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ పర్యటన ముగిసిన చంద్రబాబు కుటుంబమంతా గోవాకు బయలుదేరనుంది.
ఇది ఇలా ఉండగా, తాజాగా ఓటుకు నోటు కేసు కూడా కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అయితే, ఆ కేసు తననేం చేయలేదని చంద్రబాబు ధీమాగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు బిజీ జీవితం నుంచి రెండు రోజులపాటు ప్రశాంతంగా గడపనున్నారు.