'నేను చస్తేగానీ నాకు మంత్రి పదవి ఇవ్వరా?': చంద్రబాబుతో జేసీ
అమరావతి: రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకినని అన్నారు. ఈ రోజుల్లో కూలీ పనికి వెళ్లేవాళ్లు కూడా రోజుకు ఐదారు సార్లు టీ తాగుతున్నారని, అలాంటివారికి రూపాయికే కిలో బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తచేయలేరని, పోలవరం ప్రాజెక్టు గురించి పుట్టినప్పటినుంచి వింటున్నానన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు లేదని జేసీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వరని అన్నారు. 'నేను చస్తేగానీ నాకు మంత్రి పదవి ఇవ్వరా?' అని చంద్రబాబుతో సరదాగా అన్నానని గుర్తుచేస్తూ.. తనకు అదృష్టం లేనందున మంత్రిని కాలేకపోయానని, బాబుకు లక్ ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని ఆయన చెప్పారు.