పొత్తులో పోయింది: తన పార్టీకి ఓటేయలేని చంద్రబాబు!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొనున్నారు. అదేమంటారా.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీకే ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడింది. తమ పార్టీకే ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న టిడిపి అధినేత మాత్రం, తన పార్టీకి ఓటు వేయలేకపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ కాలనీలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారు. కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బిజెపిఅభ్యర్థికే ఓటువేయాల్సి వస్తుంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా బిజెపి తరపున చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, చంద్రబాబు నివాసం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కిందికి వస్తుంది. పొత్తులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా బిజెపికే కేటాయించారు.
ఈ స్థానం నుంచి బండారు దత్తాత్రేయ బిజెపి తరపున పోటీలో ఉన్నారు. అంటే ఇక లోకసభ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు టిడిపికి ఓటేసే అవకాశం లేదు. తెలంగాణలో ఏప్రిల్ 30న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.