చంద్రబాబు కొత్త ట్రెండ్!: విమానంలో రాజధానిపై చర్చ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం జపాన్ బృందంతో భేటీ అవుతారు. వారిని హైదరాబాద్కు తీసుకు వచ్చే అవకాశముంది. మార్గమధ్యలో విమానంలోనే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై వారితో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
ఒకరోజు ఢిల్లీ పర్యటన నిమిత్తం చంద్రబాబు ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ఉదయం తాజ్ హోటల్లో ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సీన్ కీలీని కలుస్తారు. అనంతరం ఆస్ట్రేలియా-భారత్ వ్యాపార సదస్సుకు హాజరవుతారు.
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన దాదాపు 300 మంది ఉన్నత వ్యాపార సంస్థల సీఈవోలు, సీవోవోల ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. వివిధ రంగాలకు సంబంధించి నవ్యాంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి వివరిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ఇదే విమానంలో ఆయన తనతోపాటు జపాన్ ప్రతినిధి బృందాన్ని, దానికి నేతృత్వం వహిస్తున్న ఆ దేశ ఆర్థిక, వర్తక, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి యొసుకే టకాగిని కూడా హైదరాబాద్కు వస్తారు.
మార్గమధ్యలోనే వారితో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై చర్చిస్తారని కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడించారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆస్టేలియా, సింగపూర్, జపాన్ ప్రతినిధుల భేటీలో పాల్గొననున్నారు.