వచ్చే ఎన్నికల్లో 2 సీట్లు వైసీపీకి రాసిచ్చిన చంద్రబాబు!?
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడటం ఖాయమైంది. రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని జగన్, మరోసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 2024లో జరగాల్సిన ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చని టీడీపీ భావిస్తోంది. అందుకు తగ్గ వ్యూహాలను ఇప్పటినుంచే ఖరారు చేసుకుంటూ వస్తోంది.

జగన్ ను ఎదుర్కోవాలంటే మైండ్ గేమ్ ఆడాలి!
అధికార బలంతో ఉన్న జగన్ ను ఎదుర్కోవడం అంత సులభేమీ కాదని చంద్రబాబుకు తెలుసు. అందుకే నాలుగు దశాబ్దాలుగా తాను అనుసరిస్తున్న వ్యూహాలను పక్కనపెట్టి కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థులను మందుగానే ప్రకటిస్తున్నారు. వారిలో నూతన ఉత్సహాన్ని నింపుతున్నారు. తాను కూడా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఈ తరుణంలో రెండు సీట్లపై మాత్రం చంద్రబాబునాయుడు తీవ్ర మొహమాటానికి పోతున్నారు. ఈ అలవాటును ఈసారి ఎన్నికలకు వదిలించుకోకపోతే ఓటమి ఖాయమని తెలుగుదేశం శ్రేణులే చెబుతున్నాయి.

బాబుపై ఒత్తిడి పెంచుతున్న పుట్టా!!
ఆ రెండు సీట్లు ఏవంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని, ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు. వాస్తవానికి మైదుకూరు స్థానాన్ని సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి ఆశిస్తున్నారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ మరోసారి పోటీచేస్తానంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి సుధాకర్ కుమారుడు నరసరావుపేట నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీపడాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తన కుమారుడికి సీటిచ్చే క్రమంలో అవసరమైతే తాను పోటీనుంచి తప్పుకుంటానని సుధాకర్ యాదవ్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. కానీ కొద్దిరోజులు గడవగానే మైదుకూరు కోసం బాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. సులువుగా గెలవగలిగే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసి మైదుకూరు నుంచి ఓటమిపాలయ్యారు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విఫలమవడంతో ఇతరులకు ఇద్దామని బాబు యోచిస్తున్నారు

మూడుసార్లు ఓడినవారికి సీటు లేదు
తుని నియోజకవర్గం నుంచి ఈసారి యనమలకు సీటివ్వడంలేదని టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో వినవస్తోంది. వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి సీటివ్వడంలేదని ఒంగోలు మహానాడు సందర్భంగా చంద్రబాబు, లోకేష్ ప్రకటించారు. ఈ జాబితాలో యనమల పేరు కూడా ఉంది. 1983 నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించిన యనమల 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. యనమల ఎమ్మెల్సీ అవగా, ఆయన సోదరుడు కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి తన కూతుర్ని రంగంలోకి దించుతానని సీటివ్వాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మొహమాటాన్ని వదిలించుకొని ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధిస్తారా? లేదంటే వారిద్దరికే కేటాయించి ఇప్పుడు ఆ రెండు సీట్లను జగన్ కు రాసిచ్చేస్తారా? అనేది చంద్రబాబుపైనే ఆధారపడివుంది.












Click it and Unblock the Notifications