కెసిఆర్ టార్గెట్: చంద్రబాబు జగన్ ఉచ్చులో పడ్డారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరస్పరం ఆధిపత్యం కోసం నిత్యం కుమ్ములాడుకోవడం ఆనవాయితీగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ రూపాల్లో చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి జగన్ ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు.
నిరాహారదీక్షలు, ఆందోళనలు, సమావేశాల ద్వారా ప్రత్యేక హోదా వంటి విషయాలపై చంద్రబాబుపై జగన్ పోరాటం చేస్తూ వస్తున్నారు. బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మధ్య అగాధం సృష్టించడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. అయితే, జగన్ను తిప్పికొట్టడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రతివ్యూహాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం వెనక కూడా జగనే ఉన్నాడని చంద్రబాబు ఆరోపిస్తూ వచ్చారు. మాటలతో జగన్ను తిప్పికొడుతూ వచ్చిన చంద్రబాబు చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకుంటూ జగన్ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు.
ఫిరాయింపులను నివారించడానికి జగన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ స్థితిలో జగన్ అనూహ్యంగా తెలంగాణ నీటి ప్రాజెక్టులపై దృష్టిని మళ్లించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ, వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు ఏమీ చేయడం లేదని జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నారు.
ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు అనివార్యంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితిలో పడ్డారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసే దాకా ఆయన వెళ్లారు. నిజానికి, ఇరు ప్రభుత్వాలు చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన విషయం అది. ఆ రకంగా ఏ విధమైన ప్రయత్నాలు కూడా చేయకుండా చంద్రబాబు ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలంగాణపై విరుచుకుపడుతూ వస్తున్నారు.
ఒక రకంగా చంద్రబాబు జగన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారనే చెప్పవచ్చు. చివరకు చంద్రబాబు అటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మాత్రమే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి కూడా తీవ్రమైన ఎదురుదాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.