మాజీ సీఈవోపై వేటు, కలెక్టర్ నివేదిక, చంద్రబాబు సీరియస్, మూడు రోజుల ముందే పండగ
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అధికారులే ఎక్కువ వివాదాలకు కారణం అయ్యారు. అంటే మిగితా జిల్లాల అధికారులతో పోల్చుకుంటే ఎక్కువగా విదాల్లో చిక్కుకున్న టాప్ టెన్ జిల్లాల అధికారులు ఎవరంటే చిత్తూరు జిల్లా ప్రభుత్వ అధికారులే. అందుకు కారణం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అధికారులు అందరూ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అనుకూలంగా పని చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో పాటు జిల్లా పంచాయితీ సీఈవోలు సైతం పెద్దిరెడ్డి చెప్పినట్లు విన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సీఈవోగా పని చేసిన ప్రభాకర్ రెడ్డి మీద చంద్రబాబు ప్రభుత్వం కోరడా ఝులిపించింది. పదవి విరమణ చెయ్యడానికి మూడు రోజుల ముందే చిత్తూరు జిల్లా జడ్ పీ మాజీ సీఈవో ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం సినిమా చూపించింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ లో ఇంతకాలం సీఈవో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మూడు రోజుల్లో ప్రభాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ చెయ్యాల్సి ఉండటంతో ఆయన్ను ఇప్పుడు సస్పెండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ కావడంతో ఇంతకాలం ఆయన బాధితులు జిల్లా పంచాయితీ ఉద్యోగులతో పాటు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
గురువారం అర్దరాత్రి చిత్తూరు జిల్లా పంచాయితీ కార్యాలయం ముందే టీడీపీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారంటే ప్రభాకర్ రెడ్డి ఏం చేశారో అర్థం చేసుకోవచ్చు అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభాకర్ రెడ్డి బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉద్యోగం చేసేవాడు.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రి అయిన తరువాత ప్రభాకర్ రెడ్డి సుడి తిరిగింది. జడ్పీలో ఏవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి తరువాత అడే జడ్పీలో ఇన్ చార్జ్ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రభాకర్ రెడ్డి కంటే ఎక్కువ మంది సీనియర్లు ఉన్నా జడ్పీలో ఆయన చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లా పెద్దగా ఉన్న పెద్దిరెడ్డి ఆశీస్సులతో ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు పలుకుబడి ఉపయోగించిన ప్రభాకర్ రెడ్డ అప్పటి జడ్పీ సీఈవో బలవంతంగా అక్కడి నుంచి పంపించేసి ఇన్ చార్జ్ సీఈవోగా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని అదే జడ్పీలో ఇప్పటికే పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు.

తరువాత పూర్తిస్థాయి సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి సాటి ఉద్యోగులను వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి టార్చర్ తో ఒత్తిళ్లకు గురైన ఇద్దరు ఎంపీడీవోలతో సహ ఇద్దరు ఉద్యోగులు అనారోగ్యంతో చనిపోయారని వారి కుటుంబ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ అప్పటి కలెక్టర్ షన్మోహన్ కు ఫిర్యాదులు చేశారు.
అయితే పలుకుబడి ఉపయోగించిన ప్రభాకర్ రెడ్డి పెత్తనం చెలాయించడంతో కలెక్టర్ సైతం సెలెంట్ గా ఉండిపోయారు. అయితే టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, జడ్పీ మాజీ ఛైర్మన్ గిర్వాణీ చంద్రపకాష్ బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ విచారణ జరిపి మాజీ సీఈవో ప్రభాకర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి సాటి ఉద్యోగులను వేధించాడని ఆయన చేసిన తప్పులు మొత్తం ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
ఆ నివేదిక ఆధారంగా చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ కావడంతో ఆయన భాధితులతో పాటు టీడీపీ నాయకులు న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మూడు రోజుల్లో పదవి విరమణ చెయ్యాల్సిన ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ కావడంతో ఆయనపై విచారణ జరిపించే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications