కిరణ్ వల్లకాడు వాది, బాబు మాట కోసం..: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదని, వల్లకాడు వాదని ఆరోపించారు. సచివాలయంలో ఓవర్ టైం డ్యూటీ చేస్తూ.. అనేక జీవోలపై పెన్నుతో బ్యాటింగ్ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తి సహకరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నుంచి సమైక్యమనే మాట ఎప్పుడొస్తుందోనని సీమాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభలోనైనా సమైక్యమనే మాటను చంద్రబాబు నోటినుంచి వింటామో లేదోనని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమైక్యతను కోరుకుంటే.. తమ పార్టీ ఎంపీలందరితో విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా చూడాలని డిమాండ్ చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరిస్తుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దేశంలో ఎందుకుండాలని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర సమైక్యతను కోరుకునే నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావాలని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా వారికి సూచించారు.