గిన్నీస్ రికార్డుల్లోకి చంద్రబాబు పథకం !
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న చంద్రన్న భీమా పథకాన్ని గిన్నీస్ రికార్డుల్లో నమోదు చెయ్యడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోటి మందికి చంద్రన్న భీమా పథకాన్ని అమలు చెయ్యాలని మొదట భావించారు.
అయితే ప్రభుత్వం అనుకున్న దానికంటే కోటి దాటి కోటిన్నర మందికి ఈ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు దాదాపు 2,20 కోట్ల మందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రజా సాధికారిక సర్వే పూర్తి అయితే ఈ సంఖ్య 2.50 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ప్రజా సాధికారిక సర్వే పూర్తి అయిన తరువాత 2.50 కోట్ల మందికి చంద్రన్న భీమా పథకం అమలు చేస్తున్నామని వెలుగు చూసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఇలాంటి పథకం అమలులో లేదని ఆయన పేర్కొన్నారు.
ఇదే నిజం అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు చంద్రన్న భీమా పథకం గిన్నీస్ రికార్డుల్లోకి చేరిపోతుందని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత పేదలకు చంద్రన్న భీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.