ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పోస్టు రేసులో చందు సాంబశివరావు..?
అమరావతి: ఏపీ ప్రభుత్వం మీడియా సలహాదారుడు పదవికి ఇటీవలే రాజీనామా చేశారు పరకాల ప్రభాకర్. అయితే పరకాల రాజీనామాతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు ఎవరిని నియమించాలనే దానిపై ఇప్పటికే సమాలోచనలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అన్ని రంగాలపై అవగాహన ఉన్న వ్యక్తినే ఎంపిక చేయాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటు ప్రభుత్వం అటు పార్టీని సమన్వయం చేసుకుంటూ రెండింటికీ విస్తృత ప్రచారం చేసే విధంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీడియా సలహాదారు పోస్టుకు పలువురి పేర్లు అమరావతిలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందరికంటే ముందు రేసులో టీడీపీ గుంటూరు జిల్లా ఇంఛార్జి చందు సాంబశివరావు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందరినీ కలుపుకుని వెళ్లగలిగే సామర్థ్యం చందు సాంబశివరావుకు ఉందనే నమ్మకం టీడీపీ అధినాయకత్వంలో ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video


టీడీపీ ఆవిర్భావం నుంచే ఆ జెండా మోసిన ఘనత చందు సాంబశివరావుదని టీడీపీ నేతలు చెబుతున్నారు. సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించడంతో టీడీపీ వర్గాలు కూడా మీడియా సలహాదారుడి పోస్టుకు చందు సాంబశివరావు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఏపీ సీఎం చంద్రబాబు పిలుపుతో టీడీపీలో అధికారికంగా చేరిన చందు సాంబశివరావు 2004లోనే గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి పోటీచేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో కూడా చంద్రబాబుకు సలహాలు సూచనలు ఇచ్చేవారని టీడీపీ నేతలు చెబుతున్నారు. బోధన, శాస్త్రసాంకేతికత, రాజకీయం, వాణిజ్యం,లాంటి పలు రంగాల్లో విశేష అనుభవం ఉన్న చందు సాంబశివరావు ప్రభుత్వ మీడియా సలహాదారుడు పోస్టుకు అన్నివిధాలా అర్హుడని టీడీపీలోని పలువురు అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పరకాల ప్రభాకర్ రాజీనామాను ఇంకా ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. వచ్చే నెల నాలుగవ తేదీతో పరకాల పదవీకాలం ముగుస్తుంది. అయితే సాధారణ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఈ కీలక పోస్టును అధినాయకత్వం ఎవరికి అప్పచెప్పుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications