విజయవాడలో చిరుత సంచారం కలకలం
విజయవాడలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎన్టీపీఎస్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో దృశ్యాలు మాత్రం చిరుత లాంటి జంతువు సంచారాన్ని నిర్ధారిస్తున్నాయి.
కృష్ణా జిల్లా: విజయవాడలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి లోని నార్ల తాతారావు థర్మల్ కోల్ ప్లాంట్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అర్ధరాత్రి సమయంలో కొందరు కార్మికులు ఇళ్ళకు వెళుతున్న సమయంలో వారికి పొదల్లో తిరుగుతున్న చిరుత కనిపించడంతో షాక్ తిన్నారు. కొండపల్లి ఖిల్లా అక్కడకు సమీపంలో ఉండటంతో ఆ పరిసర అడవుల నుంచి చిరుత ఇక్కడకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. చిరుత సంచారం సమాచారంతో అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
అయితే విజయవాడలో చిరుత సంచారం వట్టి వదంతులు మాత్రమేనని కొట్టి పడేస్తున్నారు. అయితే చిరుత కాదని జంగుపిల్లి మాత్రమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీపీఎస్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో దృశ్యాలు మాత్రం చిరుత లాంటి జంతువు సంచారాన్ని నిర్ధారిస్తున్నాయి. చిరుత ఆ ప్రదేశంలో తిరుగాడుతున్నదృశ్యాలను ఓ కార్మికుడు తన సెల్ ఫోన్లో వీడియో తీసి సహచర కార్మికులకు చూపడంతో ఆ వీడియో స్థానికంగా వైరల్ గా మారింది.

మరోవైపు ఈ వీడియో చూసిన స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీ శాఖాధికారులు స్థానికుల ఫిర్యాదుతో కోల్ ఫ్లాంట్ ఆవరణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీపీఎస్ మొత్తం 2వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం, అందులో 150 ఎకరాల్లో వృక్ష సంపద ఉండటంతో చిరుత ఆచూకి కష్టసాధ్యమేనని అధికారులు భావిస్తున్నారు. వృక్షాలు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, ఎన్జీపీఎస్ సెక్యూరిటీ సిబ్బంది జల్లెడపడుతున్నారు. మొత్తం మీద చిరుత సంచార వీడియోలు ఇప్పుడు చుట్టు పక్కల ప్రాంతాల్లో వైరల్గా మారాయి. దీంతో అక్కడ సంచరిస్తున్నది పులో, లేక జంగుపిల్లో తెలియాలంటే 150 ఎకరాల్లో ఉన్న వృక్ష సంపదను జల్లెడ పట్టాల్సిందేనని అటవీ అధికారులు అన్నారు.












Click it and Unblock the Notifications