Chicken Price: భారీగా తగ్గిన చిక్కెన్ ధరలు.. కానీ తినాలంటే వణికిపోతున్న ప్రజలు.. ఎందుకంటే?
Chicken Price: నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడాన్ని ఇష్టపడుతారు. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా.. సరదాగా ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా.. ఆదివారం నాడు మాంసాహారం తినాలన్నా.. కోడి కూర వండాల్సిందే. అయితే ఈ వార్త చికెన్ ప్రియులకు చెడు వార్తే. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ధరలు పడిపోవడం శుభవార్తే కదా అని అనుకుంటున్నారా?.. ధరలు తగ్గడానికి కారణం.. పౌల్ట్రీ పరిశ్రమను అంతు చిక్కని వైరస్ వణికిస్తోందట. దీంతో వారం రోజుల క్రితం వరకు రూ.220 పైనే ఉన్న ధరలు.. గురువారం కిలో స్కిన్ లెస్ రూ.195 నుంచి రూ.206, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. వైరస్ ప్రభావంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతుండగా.. పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమను హెచ్5ఎన్1 వైరస్ కలవరానికి గురిచేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అంతు చిక్కని వైరస్ పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. పౌల్ట్రీ ఫారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి.ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు క్షణాల్లో చనిపోతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి ఓ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో ఫారంలో రోజుకు దాదాపు 10 వేళ కోళ్లు చనిపోతుండడం కలవరపెడుతోంది. పౌల్ట్రీ ఫారాల్లో రోజుకు 0.05 శాతం కోళ్లు అనారోగ్య కారణాల వల్ల సాధారణంగా చనిపోతుంటాయి. కానీ ఇంత భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు.

అత్యధిక సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పడిపోతుండడంతో పౌల్ట్రీ రైతుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ఇతర రాష్ట్రాలకు 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అవుతుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 25కే పడిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పడిపోతుందని భయాందోళనలు రైతులను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉండగా.. అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు జనానికి తెలియడంతో చాలా మంది చికెన్ తినడం మానేశారు. ఈ క్రమంలోనే చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. వైరస్ కారణంగా కోళ్ల మరణాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వైరస్ ను గుర్తించి వెంటనే నిరోధక చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వైరస్ సోకిన పౌల్ట్రీఫారాల నుంచి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో వైరస్ వ్యాపించి 2012, 2020లో కూడా లక్షలాది కోళ్లు మరణించాయి.












Click it and Unblock the Notifications