అప్పటి దాకా హైకోర్టు ఎక్కడికీ పోదు -ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!
హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధిస్తూనే.. అనేక సందేహాలు వ్యక్తం చేసారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ మూడోరోజు కీలక వాదనలు వినిపించారు.

కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు
అసలు న్యాయ రాజధాని అంటే ఏమిటి అని ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను (హెచ్ఆర్సీ) ఇప్పటికే ఏర్పాటు చేసిందని చెప్పారు. హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేసారు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూల్లో న్యాయ రాజధాని ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

హైకోర్టు లేకుండా రాజధాని ఎలా సాధ్యం
హైకోర్టు లేకుండా రాజధాని ఎలా సాధ్యమని సందేహం వ్యక్తం చేసారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పాలన వికేంద్రీకరణ చట్టంలో ఉందని.. అలాంటి హామీని చట్టంలో పొందుపరచవచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అమరావతి ఏర్పాటు విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం.. హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ వర్తిస్తుందా అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

హైకోర్టు తరలించటానికి వీల్లేదు
పిటీషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటు చేశారన్నారు. అమరావతి విషయంలో ఓసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి వీల్లేదన్నారు. అదే తరహాలో ఏపీ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్రం ఓసారి నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఓసారి జరిగిపోయిన నిర్ణయం హైకోర్టుకు వర్తిస్తుందన్నారు. రాజధాని అమరావతి నుంచి హైకోర్టును తరలించడానికి వీల్లేదన్నారు.
Recommended Video

ఏపీ విభజన చట్టానికి సవరణ చేస్తేనే
శాసన, కార్యనిర్వహణ, న్యాయ విభాగాలన్నీ ఒకచోట ఉంటేనే రాజధాని అవుతుందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమరావతిలో 'న్యాయ నగరం' ఇప్పటికే ఏర్పాటు అయ్యిందన్నారు. ఏపీ విభజన చట్టానికి సవరణ చేస్తేనే హైకోర్టు తరలింపు సాధ్యమని తమ వాదనల్లో పేర్కొన్నారు.
రాజధాని వ్యాజ్యాలపైన రోజు వారి విచారణ ప్రారంభించిన హైకోర్టు లో అమరావతి రాజధాని..మూడు రాజధానుల ప్రతిపాదనల పైన కీలక వాదనలు సాగుతున్నాయి. అమరావతి కేసుల ప్రాధాన్యత..రైతుల పోరాటం గురించి కోర్టు విచారణ సమయంల పలు కీలక అంశాలను ప్రస్తావిస్తోంది. దీంతో..న్యాయస్థానం లో జరుగుతున్న వాదనల పైన అమరావతి రైతులతో పాటుగా ఏపీ ప్రజలు సైతం ఆసక్తిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications