వైఎస్ జగన్ చిన్నకుమార్తెకు యుఎస్ టాప్ యూనివర్శిటీలో సీటు
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న కుమార్తె వర్షా రెడ్డి కూడా ఇక విదేశాల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించబోతున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్నారు. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో విద్యను అభ్యసిస్తున్నారు. వర్షా రెడ్డి సైతం విదేశీ విద్య కోసం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో వర్షా రెడ్డికి సీటు లభించింది. ఈ నెల 20వ తేదీన ఆమె ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకోనున్నారు.
చంద్రబాబు చేతికి కట్టు..విశ్రాంతి కోసం హైదరాబాద్ కు!
ఈ నేపథ్యంలో- వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. శుక్రవారం ఆయన అమెరికాకు వెళ్తారు. 24వ తేదీ వరకు అక్కడే ఉంటారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి రెడ్డి, కుమార్తె వర్షా రెడ్డిలతో కలిసి యుఎస్ పర్యటనకు వెళ్లనున్నారు. జెరూసలేం తరహాలోనే ఈ పర్యటన కూడా పూర్తి వ్యక్తిగతమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నారని స్పష్టం చేశాయి. భద్రతా వ్యవహారాల పర్యవేక్షణ కోసం మాత్రమే నిధులను మంజూరు చేయాల్సి ఉందని వెల్లడించాయి.
తన అమెరికా పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. అమెరికా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరించనున్నారు. ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులతో విస్తృత చర్చల్లో పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీన డల్లాస్ లోని హచిసన్ స్టేడియంలో ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలకు హాజరవుతారు. దీనికోసం నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు, హోర్డింగులను కట్టారు. 22వ తేదీన చికాగోలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు.