అధికారులు వర్సెస్ ఎన్నికల కమిషనర్: ప్రభుత్వ యంత్రాంగంలో అసంతృప్తి: నీలం సాహ్నీ లేఖ..!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగంలో కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది. కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను వాయిదా వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
నీలం సాహ్నీ లేఖ..
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని ఆమె ఈ లేఖలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియను యధాతథంగా కొనసాగించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని గుర్తు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఒక్కటే..
నెల్లూరు జిల్లాలో ఒక్క వ్యక్తికి మాత్రమే పాజిటీవ్గా తేలిందని, పైగా అతను ఇటలీ నుంచి వచ్చినందు వల్లే కరోనా వైరస్ బారిన పడ్డాడని వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను నీలం సాహ్నీ ఈ లేఖలో పొందుపరిచారు.
పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ అంత వేగంగా వ్యాప్తి చెందకపోవచ్చని అన్నారు. ఇవే పరిస్థితులు కనీసం మరో నాలుగు వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ 10 రోజుల్లోనే ముగిసిపోతుందని పేర్కొన్నారు. ఈ లోగా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి మరిన్ని చర్యలను చేపడతామని అన్నారు. ఇందులో భాగంగా- పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని చెప్పుకొచ్చారు.
Recommended Video
ఎన్నికల ముంగిట్లో వాయిదా సరికాదంటూ..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం మొత్తం సమాయాత్తమైందని నీలం సాహ్నీ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయిందని వివరించారు. వాయిదా వేయడం వల్ల ఆయా పనులన్నింటినీ మరోసారి చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను ఆమె పేర్కొన్నారు.