సహస్ర కిడ్నాప్ ఛేదించిన పోలీసులు: బాబాయే కిరాతకుడు, చేతులు కట్టేసి, ప్లాస్టర్..
విజయవాడ/ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సొంత బాబాయే డబ్బుల కోసం ఆ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తేల్చారు. మరో ఇద్దరి సహకారంతో చిన్నారి బాబాయి ఈ కిడ్నాప్నకు పాల్పడినట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లీశ్వరిలు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మల్లీశ్వరి కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. శ్రీనివాసులరెడ్డి హనుమంతునిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
వీరికి లాస్య, సహస్ర(6) అని ఇద్దరు చిన్నారులు. వీరిని తల్లి మల్లీశ్వరి తాను పని చేసే పాఠశాలకు రోజూ తీసుకెళ్లి అక్కడే చదివిస్తుంటుంది. ఎండలు ఎక్కువుగా ఉండటంతో గురువారం వారిని కొత్తపేటలో ఉంటోన్న నానమ్మ ఇంటివద్ద వదిలి వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి పదో తరగతి పబ్లిక్ పరీక్ష విధులకు వెళ్లారు.

అందరూ చూస్తుండగానే కిడ్నాప్
కాగా, ఇంటి పంచలో చిన్నారులిద్దరూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చేతులకు గ్లౌజులు ధరించి, మూతికి రుమాళ్లను అడ్డుగా కట్టుకుని, తలకు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు.
ఇంటి వద్ద ఆడుకుంటోన్న అక్కాచెల్లెళ్లలో అక్క అయిన లాస్యను పక్కకు నెట్టారు. చెల్లెలు సహస్రను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. విషయాన్ని గమనించిన పరిసర ప్రాంత వాసులు కేకలు పెడుతున్నప్పటికీ లక్ష్య పెట్టక వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. అందరూ చూస్తుండగానే ఆంధ్రాబ్యాంకు రోడ్డు మీదుగా గార్లపేట రోడ్డు గుండా గుడిపాడు, తాళ్లూరు మీదుగా మర్రిపూడి మండలం వైపు వెళ్లారు.

కాగా, చిన్నారి అపహరణ అనంతరం 7842943018 సెల్ నెంబరుతో చిన్నారి సహస్ర తల్లి మల్లీశ్వరికి ఓ ఫోన్ వచ్చింది. చిన్నారిని అపహరించామని.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే పాపను చంపివేస్తామని బెదిరించారు. ఈ నెంబరు తెలంగాణ ప్రాంతానికి చెందిన జయంత్శర్మ అన్యే వ్యక్తి పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

చిన్నారి అపహరణ విషయం పది నిమిషాల్లోనే పోలీసులకు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్పీ శ్రీకాంత్ జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి శ్రీనివాసులరెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్కాపురం డీఎస్పీ శ్రీహరి, కనిగిరి సీఐ యు.సుధాకరరావు, కనిగిరి ఎస్ఐ యు.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం కేసును వేగంగా దర్యాప్తు చేశారు.
సిమ్ కార్డు ఆధారంగా నిందితుల గుర్తింపు
విజయవాడలోని ఓ ఫ్లాట్ నిందితులు ఉన్నట్లు పోలీసులు.. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డు ద్వారా గుర్తించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి చిన్నారిని విడిపించారు. చిన్నారి సహస్ర కాళ్లూ, చేతులూ వెనక్కి మలిచి కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ గదిలో మరో మహిళ కూడా ఉంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి తండ్రి శ్రీనివాసుల రెడ్డి తమ్ముడు రాజేశ్ రెడ్డి ఈ కిడ్నాప్నకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. వ్యసనాలకు బానిసైన రాజేష్ రెడ్డి.. డబ్బుల కోసమే చిన్నారి కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి చిన్నారిని గుర్తించిన పోలీసులు.. శుక్రవారం ఉదయం ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సహస్రను సురక్షితంగా తమకు అప్పగించినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సొంత తమ్ముడే ఈ దారుణానికి పాల్పడటంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాజేష్.. మరో ఇద్దరి సాయంతో చిన్నారిని కిడ్నాప్ చేశాడని పోలీసులు చెప్పారు. దుబరాగా తిరిగే అతను వ్యసనాలకు బానిసయ్యాడని తెలిపారు. ఈ క్రమంలోనే డబ్బుల కోసం సొంత సోదరుడి కూతుర్నే కిడ్నాప్ చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications