బాబుపై టీ మంత్రి ఘాటుగా: మీరు చెబుతారా అని చినరాజప్ప
విశాఖ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తెలంగాణలో అడుగు పెట్టనీయమన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి పైన ఏపీ మంత్రి చినరాజప్ప మంగళవారం మండిపడ్డారు.
పదవి కోసం పార్టీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లిన స్వార్థపరుడు మహేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పైన మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
మహిళల భద్రతపై...
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చినరాజప్ప తెలిపారు. విశాఖలో ఎటీఎం తరహాలో ఉండే ఐకేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విశాఖపట్టణం ఎంతో అందమైన నగరమని, ఇలాంటి నగరంలో మొదటిగా ఐకేర్ సెంటర్ను ప్రారంభించామన్నారు.
దీని ద్వారా మహిళలు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా నిర్భయంగా ఈ మెషిన్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని, వాటిని పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలించి విచారిస్తారన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే కొంత ఇబ్బందిగా భావిస్తారని, కానీ ఈ మెషిన్ల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
విరాళాలు ఇస్తే దాతల పేర్లు: కామినేని
నర్సింగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఆశా ఆసుపత్రుల్లో ఉద్యోగుల హెల్త్ పాలసీ అమలుపై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 25 శాతం విరాళాలు ఇస్తే దాతల పేర్లు పెడతామన్నారు.