ఫోటో రాజకీయం: 'పిల్లిలా బొత్స, నిలబడి మాట్లాడే సత్తా ఉందా?'
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందు హోంమంత్రి వణికిపోతూ మాట్లాడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై చినరాజప్ప స్పందించారు. నారా లోకేశ్ తననేమీ అనలేదని, వైసీపీ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందని మంత్రి చినరాజప్ప అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ పార్టీయే సుప్రీం అని, లోకేశ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిని ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నారని, చంద్రబాబుపై దుష్ప్రచారం చేసేందుకే బొత్సతో జగన్ కమిటీ వేశారని ఆయన మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలుంటాయని పేర్కొన్నారు. పనిలో పనిగా బొత్సపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొత్సకు జగన్ ముందు నిలబడి మాట్లాడే సత్తా ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్ ఎదుట బొత్స సత్యనారాయణం లాంటి వారు పిల్లిలా వ్యవహరిస్తారని తెలిపారు.

జగన్ తీరుని భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. బొత్సలా తనపై కుంభకోణాలు లేవని, తానెవరికీ భయపడాల్సిన అవసరం లేదని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నాం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం తనయుడు లోకేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని అన్నారు. లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications