ర్యాపిడ్ కిట్లపై భారత్ వాదన తోసిపుచ్చిన చైనా సంస్ధ- టైమింగ్ తోనే ఫలితాలని స్పష్టత...
కరోనా వైరస్ పరీక్షల కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్లపై రచ్చ కొనసాగుతూనే ఉంది. లోపాలున్న కారణంతో కేంద్ర ప్రభుత్వం వీటి ఆర్డర్లను రద్దు చేయగా... దీనిపై తయారీదారు వోండ్ ఫో ఘాటుగా స్పందించింది. పరీక్షలు నిర్వహించే టైమింగ్ ఆధారంగానే ఫలితాలు ఉంటాయని, అంతే తప్ప కిట్లలో ఎలాంటి లోపం లేదని వీటి తయారీ దారు వోండ్ ఫో బయోటెక్ వివరణ ఇచ్చింది. ఈ కిట్లను గతంలో పూణే నేషనల్ వైరాలజీ ర్యాబ్ లో పరీక్షల తర్వాత ఐసీఎంఆర్ ఆమోదించిందని గుర్తుచేసింది.
కరోనా పరీక్షల ఫలితాల్లో తేడాలు వస్తున్నాయన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా వీటి ఆర్డర్లను రద్దు చేసింది. ఇప్పటికే తీసుకున్న కిట్లను సైతం వెనక్కి పంపుతోంది. దీనిపై ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడిన వోండ్ ఫో ప్రతినిదులు భారత్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లను వైరస్ పై నిఘా కోసం వాడుతున్నట్లు చెప్పిందని, తాజాగా ఫలితాల్లో పొంతన ఉండటం లేదని చెబుతోందని వోండ్ ఫో ప్రతినిధులు ఆరోపించారు. వైరల్ ఇన్ ఫెక్షన్ ను పరీక్షించే క్రమంలో వివిధ పద్ధతుల్లో ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలా చేస్తేనే కచ్చితమైన ఫలితాలు పొందవచ్చని వోండ్ ఫో చెబుతోంది.
Recommended Video
గతంలో జాతీయ వైరాలజీ ల్యాబ్ లో పరీక్షల తర్వాత వివిద రాష్ట్రాలకు ర్యాపిడ్ కిట్లను పంపిన ఐసీఎంఆర్ తాజాగా వాటిని వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు వాడుకోవచ్చని మాత్రం సూచిస్తోంది. పరీక్షల కోసం మాత్రం వాడొద్దని రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. దీంతో ఐసీఎంఆర్ వ్యవహారశైలి మరోసారి విమర్శల పాలైంది.