చింతకాయల విజయ్ పై సీఐడీ కేసులో కీలక పరిణామాలు..!!
తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ పైన సైబర్ క్రైం కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ మేరకు ఇప్పటికే విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు గత వారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందచేసారు. దీనికి సంబంధించి సీఐడీ కార్యాలయంలో విజయ్ విచారణకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ నడుమ ఆయన న్యాయవాదులు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఐడీ ఉన్నతాధికారులకు విజయ్ రాసిన లేఖ అందించటానికి వారు కార్యాలయానికి చేరుకున్నారు.
విజయ్ లేఖతో న్యాయవాదులు
విజయ్ విచారణకు హాజరవుతారనే ఉద్దేశంతో సీఐడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కానీ, విజయ్ హాజరు కాలేదు. విజయ్ తరపున వచ్చిన న్యాయవాదులు తాము తీసుకొచ్చిన లేఖను అందించే ప్రయత్నం చేసారు. అధికారులకు నేరుగా లేఖ ఇచ్చేందుకు విజయ్ తరపు న్యాయవాదులు చాలా సేవు వేచి చూసారు. కానీ, స్పందన రాలేదు. దీంతో.. తపాలా విభాగంలో ఆ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. సీఐడీ పోలీసులు విజయ్ నివాసంలో ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కాకుండా, పనిమనిషిలకు ఇస్తే చెల్లదని వివరించారు.
నోటీసులో వివరాలు లేవంటూ
ఆ నోటీసులో కేసు వివరాలు ప్రస్తావించలేదని, భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారనని వ్యాఖ్యానించారు. ఇక, తనకు జారీ చేసిన నోటీసుల పైన చింతకాయల విజయ్ సీఐడీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు. తన నివాసంలోకి అక్రమంగా ఏపీ సీఐడీ పోలీసులు ప్రవేశించారని ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్ను కొట్టారని, తన పిల్లల్ని సంరక్షించే వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఐడీ నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ
ఇక, ఇప్పుడు విజయ్ విచారణకు రాకపపోవటం..న్యాయవాదుల ద్వారా లేఖ పంపటంతో సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. న్యాయవాదులు తమ కార్యాలయంలో ఇచ్చిన లేఖ ఆధారంగా సీఐడీ తదుపరి చర్యలు ఉంటాయా.. విజయ్ పంపిన లేఖను అధికారులు పరిగణలోకి తీసుకుంటారా.. ఇప్పుడు సీఐడీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇప్పటికే విజయ్ కు నోటీసు ఇచ్చే సమయంలో సీఐడీ అధికారులు దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేయగా.. ప్రభుత్వంలోని మంత్రులు తప్పు బట్టారు. విజయ్.. టీడీపీ సోషల్ మీడియా ద్వారా అనుచితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.