నేటితో సమస్యలకు శుభం కార్దు - చిరంజీవి : ఏపీలో ఫిలిం సిటీ : జగన్ వద్దకు సినీ ప్రమఖులు..!!
కాసేపట్లో సీఎంతో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి చిరంజీవి టీం ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయల్దేరారు. సీఎం జగన్ తో సమావేశం పైన గన్నవరానికి బయల్దేరే ముందు మెగాస్టార్ చిరంజీవి స్పందించారదు. ఈ సమావేశం ద్వారా పూర్తిగా సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఈ సమావేశం ద్వారా ఎండ్ కార్డు పడుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేసారు. చిరంజీవి టీంలో నాగార్జున..మహేష్ బాబు..ప్రభాస్..రాజమౌళి.. కొరటాల శివ..నారాయణ మూర్తి వంటి ప్రముఖులు ఉన్నారు.

సమస్యలు - ఏపీలో కార్యకలాపాలు
వీరందరూ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తరువాత సీఎంతో లంచ్ భేటీ జరగనుంది. సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు, థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా, సినిమా రంగానికి ప్రభుత్వపరంగా అందాల్సిన సహకారంపైనా చర్చించనున్నారు. సినిమా టికెట్ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.

ప్రభుత్వం అండగా.. మీరేం చేస్తారు
ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా, ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్కు వివరించారు.
ఇదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఏపీలో ఇండస్ట్రీ విస్తరణ దిశగా సీఎం కొన్ని ప్రతిపాదనలు చేసేందుకు సిద్దమయ్యారని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఏపీలో ఫిలిం సిటీ నిర్మాణంతో పాటుగా... స్టూడియోల ఏర్పాటు.. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ వంటి వాటి పైన సీఎంకు కొందరు టాలీవుడ్ ప్రముఖులు హామీ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీలో ఫిల్మ్ సిటీ.. స్టూడియోలపై తేల్చేస్తారా
ఏపీ లో షూటింగ్స్..లొకేషన్స్ ఫీజులు.. ధియేటర్లకు రాయితీలు ... సినిమా పరిశ్రమ ఏపీలో విస్తరించేలా ప్రోత్సాహకాల పైన టాలీవుడ్ ముందుకు వస్తే..సీఎం తాను ఏం చేయబోయేది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాటుగా సినిమా టిక్కెట్ల ధరల పైన ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ టీం ముందు ఉంచి..వారి సూచనలతో తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని..అదే సమయంలో ఏపీలో పరిశ్రమ ద్వారా ఉపాధి... ఇండస్ట్రీ విస్తరణ పైన సీఎం హామీ కోరుతున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో..ఈ సమావేశం అటు టాలీవుడ్..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మధ్నాహ్నం సమావేశం ముగిసిన తరువాత ప్రభుత్వం నుంచి మంత్రి.. ఇండస్ట్రీ ప్రముఖులు పూర్తి అంశాలు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications