వోల్వో ప్రమాదం: అభిమాని కుటుంబానికి చిరు 5లక్షలు
బెంగళూరు: పదిహేను రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనలో సజీవ దహనమైన చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు వెంకటేష్ యాదవ్ కుటుంబానికి పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందించారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఐదు లక్షల రూపాయలను అందజేశారు. కర్నాటక రాజధాని బెంగళూరులో సోమవారం నిర్వహించిన పెద్ద కర్మలో చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటేష్ యాదవ్ అఖిల కర్నాటక చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. వెంకటేష్ కుమార్తెలిద్దరికి రూ.3 లక్షలు, భార్య శాంత, తండ్రి సుందర రాజ్లకు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ అందించిన రూ.లక్ష డిడిలను నాగబాబు అందించారు.
కాగా, మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం అఖిల కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. వెంకటేష్ యాదవ్ మృతికి ఆంధ్రప్రదేస్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు సంతాపం ప్రకటించారు.