మేరే పాస్ మా హై: చిరంజీవి అమితాబ్ సినిమా డైలాగ్
శ్రీకాకుళం: ‘మేర పాస్ బ్యాంకు బ్యాలెన్స్ హై.. బంగ్లా హై.. సబ్ హై.. తుమ్హారే పాస్ క్యాహై' అనే హిందీ సినిమా ‘దివార్'లోని డైలాగును కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. ఆ డైలాగును పొడగిస్తూ.. ‘మేరే పాస్ మా హై' అని చెబుతూ.. చిరంజీవి ఆకట్టుకున్నారు. మా అంటే ఆయన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని అర్థం వచ్చేలా ఆ డైలాగు చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొందరు స్వార్థపరులైన నాయకులే కాంగ్రెస్ పార్టీని వీడారని, కార్యకర్తలు, అభిమానులు పార్టీతోనే ఉన్నారని చిరంజీవి చెప్పారు. చిరంజీవి నాయకత్వం వర్ధిల్లాలి అని కార్యకర్తలు నినాదాలు చేయగా.. అందరి నాయకత్వం వర్థిల్లాల్లని, మీరూ నాయకులు కావాలని కార్యకర్తలతో అన్నారు. కార్యకర్తలకు ఇదొక సువర్ణావకాశమని చిరంజీవి అన్నారు. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని భయపడిన కొందరు నేతలు పార్టీని విడిచిపోయారని ఆరోపించారు. అది కూడా మంచిదేనని, కార్యకర్తలకు నాయకులు అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు.

తనను కూడా పార్టీ వీడాలని కొందరు కోరారరని, అయితే తాను వ్యక్తిత్వం ఉన్న వాడిని కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడలేదని చెప్పారు. సోనియా ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చిరంజీవి చెప్పారు. ఇన్ని రోజులు తిట్టిన పార్టీల పంచనే కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చేరుతున్నారని ఆరోపించారు. మన పార్టీని మనమే అభివృద్ధి చేసుకుందామని చిరంజీవి కార్యకర్తలకు చెప్పారు.
పదవీ దాహంతోనే వారందరూ పార్టీని వీడారని ఆరోపించారు. ఇంతవరకు ఏం చేశావు, తెలంగాణపై నీ అభిప్రాయం ఏమిటని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనను ప్రశ్నించిందని.. అప్పుడు కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అయితే ఇరుప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయం ఉండాలని చెప్పినట్లు తెలిపారు. సిపిఎం తప్ప రాష్ట్రంలోని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాయని, అందువల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.
విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసివుంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని చిరంజీవి చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుడి ఉంటానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, నిర్ణయం తర్వాత వ్యతిరేకించారని చెప్పారు. ఆఖరి క్షణం వరకు సిఎం పదవులను అనుభవించి పార్టీపై విమర్శలు చేయడం తగదని అన్నారు.
పదవులు అనుభవించి పార్టీని వీడారు: రఘువీరా
కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి ఇన్నేళ్లపాటు అన్ని రకాల పదవులు అనుభవించిన కొందరు పెద్ద మనుషులు, ఇప్పుడు పార్టీ బలహీనపడిందని చెప్పుకుంటూ బయటికి పోవడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలను ఉద్దేశించి రఘువీరా రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసం పార్టీలు మారుస్తున్నారని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే కారణమని ఆరోపించారు. జగన్ పార్టీ విభజన చేయాలని తీర్మానాలు చేసిందని, కేంద్రానికి ఉత్తరాలు కూడా రాసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర విభజన చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు.
అన్ని పార్టీల నిర్ణయం తర్వాతనే కాంగ్రెస్ పార్టీ విభజనపై నిర్ణయం తీసుకుందని రఘువీరారెడ్డి తెలిపారు.
విభజన బాధాకరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిందని, ఐదేళ్లపాటు పన్ను మినిహాయింపులు ఇవ్వడంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని రఘువీరా రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఐదేళ్లపాటు కేంద్రం నుంచి సీమాంద్ర ప్రాంతానికి 30వేల కోట్లు నిధులు వస్తాయని, ఈ నిధుల్లో 27వేల కోట్లు ఉచితంగానే అందజేస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications