పవన్ మీటింగ్కు రావొద్దు: చిరంజీవి, షాకిచ్చిన ఫ్యాన్స్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, శుక్రవారం జరిగే సభకు హాజరు కావద్దని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అబిమాన సంఘాలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కువమంది అభిమానులు తాము రేపటి సమావేశానికి వెళ్తామని చిరుకు స్పష్టం చేశారట. పవన్ను ఒంటరి చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారట.
పవన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సంకేతాలు వెలువడి నాటి నుంచే చిరు కుటుంబంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. పార్టీ స్థాపన గురించి అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడినట్లుగా వినికిడి. రేపటి సమావేశాలకు వెళ్లరాదన్న ఆదేశాలను కొంతమంది చిరు అభిమానులు ధిక్కరిస్తూ మాట్లాడారట.

చిరును నమ్ముకుని ప్రజారాజ్యం వెంట నడిస్తే చివరికి చిరు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు కొంతమంది ముక్కు సూటిగా వెళ్లే పవర్ స్టార్ వెంట నడిస్తేనే మంచిదని భావిస్తున్నారట. వారు ఈమాటే చిరుకు స్పష్టం చేశారంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ముఖ్యమైన కేంద్రాలలో పెద్ద పెద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నారు. పవన్ మీడియాతో మాట్లాడడాన్ని ఈ 18 కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అయితే పవన్ కల్యాణ్ బహిరంగ సభలో మాట్లాడతారంటూ అందుకు ఒక ఏజన్సీ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు వచ్చిందని మాదాపూర్ డిసిపి క్రాంతి రాణా వెల్లడించారు. ఈ సభకు మూడు వేల మంది హాజరు కావచ్చునని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు హైదరాబాద్ హైటెక్స్లో ఒక వేదిక సిద్ధమవుతున్నది. పవన్ మొత్తం ముప్పావు గంట పాటు మాట్లాడతారని తెలుస్తున్నది.
పవన్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చిచ్చు పెట్టింది. చిరంజీవి కుమారుడు రాం చరణ్ తేజ్ మొన్న, చిరంజీవి సోదరుడు నాగబాబు నేడు తామంతా చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పవన్ ఒంటరి అయిపోయారు. ఎవరు ఏమి మాట్లాడినా పేర్టీ పేరు ప్రకటించే వరకూ మారు మాట్లాడకూడదని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications