పవన్, జీవితలు దూసుళ్తున్నా:తెలుగోళ్లకు చిరు దూరం!
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ తెలుగువాళ్లకు దూరంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సహా పలువురు తెలంగాణలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చిరు మాత్రం తెలంగాణలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండేందుకు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార బాధ్యతలు ఓ కారణమైనప్పటికీ... తెలంగాణ ఏర్పాటు అంశంలో ఆయన వ్యవహరించిన తీరే అందుకు కారణమని చెప్పవచ్చు.
చిరంజీవికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ కారణంగానే కాంగ్రెసు పార్టీ ఆయనతో కర్నాటకలోను రెండు ఎన్నికలలో ప్రచారం చేయించింది. గత ఉప ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో... కర్నాటకలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చిరు ప్రచారం నిర్వహించారు. అయితే, అదే చిరంజీవి... తనకు అభిమానులు ఎక్కువగా ఉండే తెలంగాణలో మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్... మోడీతో కలిసి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. బిజెపి తరఫున ప్రచారానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఆయన ప్రచారం చేస్తే తమకు కలిసి వస్తుందని బిజెపి, టిడిపి అభ్యర్థులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో పవన్ రెండు సభల్లో మంగళవారం పాల్గొంటున్నారు.
హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, బిజెపి నేత జీవిత కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బిజెపి తరఫున వారు ప్రచారం చేయనున్నారు. ఇక రాములమ్మ విజయశాంతి సైతం తన నియోజకవర్గం పరిధిలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే, మొదటి నుండి విజయశాంతి తెలంగాణ కోసం ఉద్యమిస్తుండటం గమనార్హం.
పవన్, జీవితా రాజశేఖర్లు తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ... ఎందరో అభిమానులు కలిగిన చిరంజీవి మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన సామాజిక తెలంగాణ అన్నారు. కాంగ్రెసు పార్టీలో పిఆర్పీని విలీనం చేశాక... అధిష్టానం నిర్ణయమన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చాక... తాను వ్యక్తిగతంగా సమైక్యవాదనని చెప్పారు. అంతేకాదు.. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని పట్టుబట్టారు.
దీంతో తెలంగాణవాదులు చిరంజీవి పైన ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు, సీమాంధ్రకు కాంగ్రెసు పార్టీ వేర్వేరు పిసిసిలను వేసింది. ప్రచార కమిటీలను కూడా వేర్వేరుగా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అశేష అభిమానులు ఉన్నప్పటికీ చిరు సీమాంధ్రకే పరిమితమవుతున్నారు. ఎపిసిసి ప్రచార కమిటీగా నియమితులైన చిరు.. కర్నాటకలో ప్రచారం చేశారు. తెలంగాణలో మాత్రం ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు.