పవన్ కళ్యాణ్ ఒంటరి: చిరంజీవి తప్పుకుంటారా?
హైదరాబాద్: తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే విషయంలో వెనక్కి తగ్గకపోవడం కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఇబ్బంది కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆయన సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ప్రచార కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతగా నచ్చజెప్పుకున్నా చిరంజీవికి కొంత ఇబ్బందిగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దించేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కాంగ్రెసుపై విమర్శలు చేస్తే ప్రచార కమిటీ చైర్మన్గా చిరంజీవి ఎదుర్కోకక తప్పదు. విమర్శలను తిప్పికొట్టాల్సిన అనివార్యమైన పరిస్థితిలో పడుతారు. దీంతో అన్నదమ్ముల మధ్య వైరం తారాస్థాయికి చేరే అవకాశం కూడా ఉంది.

పైగా, రేపు పార్టీని ప్రకటించే సమయంలో తన కుటుంబ సభ్యులపై, తన అన్నయ్య చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. రేపు పవన్ కళ్యాణ్ మాట్లాడే విషయాల మీద చిరంజీవి ప్రతిస్పందన ఉండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంలో ఒంటరివారయ్యారు.
మెగా అభిమానుల మధ్య నెలకొన్న అయోమయాన్ని నివారించడానికంటూ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చాలా స్పష్టంగా తన వైఖరిని వెల్లడించారు. ఆయన పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించారు. చిరంజీవి వైపు ఉంటున్నట్లు చెప్పారు. చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ చాలా ముందుగానే బాబాయ్ పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ను సమర్థించే అవకాశం లేదు.
పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం పవన్ కళ్యాణ్కు తెలియనివి కావు. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడే ఆయన పార్టీని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన రేపు గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాదులోని మాదాపూర్లో గల హైటెక్స్లో మీడియా సమావేశంలో తన పార్టీ గురించి చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications