రాహుల్ గాంధీ ఆఫర్ను తిరస్కరించిన చిరంజీవి: రాజకీయాలకు దూరం ఇందుకేనా!?
హైదరాబాద్/అమరావతి: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినీ రంగం వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఆయన సైరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన సోదరుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఎక్కడా కనిపించని చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా చిరంజీవి పాల్గొనకపోవడం గమనార్హం.
Recommended Video
రాహుల్ కోరినా..
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చిరంజీవితో మాట్లాడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఏఐసీసీలో కీలక పదవిని అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చిరంజీవికి రాహుల్ చెప్పారట. అయితే, చిరంజీవి మాత్రం ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
రాహుల్కు.. స్పష్టం చేసిన చిరంజీవి
తాను క్రియాశీల రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీకి చిరంజీవి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్స్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారట. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అధినేతకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
అప్పుడే వస్తారు..
కాగా, తాను నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకల కోసం తన సమయాన్ని కేటాయించేందుకు సిద్ధమని చిరంజీవి తెలిపారట. ఈ క్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి చిరంజీవి ఎంతో నమ్మకమైన వ్యక్తి అని తెలిపారు. చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా లేకున్నా.. ఆయన కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పాల్గొంటారని రఘువీరా ఆశాభావం వ్యక్తం చేశారు.