మరో వివాదంలో చిరు, గన్మెన్తో బూత్లోకి..
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు గన్మెన్తో ఆయన పోలింగ్ బూత్లోకి వచ్చారనే ఆరోపణ వచ్చింది. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ క్లబ్లో బుధవారం చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. విఐపి పోలింగ్ బూత్లోకి వచ్చినప్పుడు ఓ గన్మన్ తోడు రావచ్చునని, అయితే అతను ఆయుధాన్ని ప్రదర్శించకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు.
తనను క్యూలో రావాల్సిందిగా అడిగిన వోటరుతో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గన్మెన్ చుట్టూ తిరుగుతూ కనిపించారు. క్యూలో నిలుచోకుండా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన చిరంజీవిని ఓ ఓటరు నిలదీశాడు. దాంతో చిరంజీవి ఇబ్బందికి గురయ్యారు.
తాను నిబంధనలను ఉల్లంఘించే మనిషిని కానని, తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, ఓటర్ల జాబితాలో తన పేరును చూసుకోవడానికి మాత్రమే వెళ్లానని చిరంజీవి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు తాను ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఓటేశానని, ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లబ్కు వచ్చానని, దాంతో తన పేరును జాబితాలో చూసి ధ్రువీకరించుకోవాలని అనుకున్నానని చిరంజీవి వివరణ ఇచ్చారు.