చిరంజీవిని లాగండి: ఓ వైపు చంద్రబాబు, మరోవైపు జగన్
Recommended Video

అమరావతి: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవిని లాగేందుకు ఓ వైపు తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాలతో తీరిక లేకుండా ఉన్న చిరంజీవి కాంగ్రెసు కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే, ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఏ విధమైన ప్రకటనలు కూడా చేయడం లేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు అదే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేస్తామనే హామీతో తమ తమ పార్టీల్లోకి టిడిపి, వైసిపి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవిపై దృష్టి ఎందుకు...
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అధికారంలోకి రాకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఆయనకు బలం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

పాత మిత్రులతో...
గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవితో కలిసి పనిచేసిన నాయకులు తెలుగుదేశం పార్టీలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ ఉన్నారు. వారి ద్వారా ఓ వైపు చంద్రబాబు, మరో వైపు జగన్ చిరంజీవిని తమవాడిని చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ద్వారా ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పనిచేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

గంటా శ్రీనివాస రావు...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చిరంజీవిని తెలుగుదేశంలోకి రావాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారరం. గంటా శ్రీనివాస రారవు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనమైన తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.

చిరంజీవి విముఖత...
కేవలం రాజ్యసభ సీటు కోసం, ఎంపి కావడానికి పార్టీ మారాలనే సూచనను చిరంజీవి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవిని ఒప్పించడానికి ఇంకా సమయం ఉందనే భావనతో గంటా శ్రీనివాస రావు ఉన్నట్లు చెబుతున్నారు. గంటా చెప్పిన సూచనపై ఆలోచన చేయాల్సిందిగా బిజెపి నాయకుడు, మరో ఎపి మంత్రి కామినేని శ్రీనివాస రావు చిరంజీవికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. కామినేని శ్రీనివాస రావు కూడా ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆ తర్వత బిజెపిలో చేరారు.

కన్నబాబు ద్వారా జగన్...
తమ పార్టీలోకి చిరంజీవిని రప్పించడానికి తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కన్నబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కన్నబాబు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. చిరంజీవితో మంతనాలు సాగించాల్సిందిగా జగన్ కన్నబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని కన్నబాబు చెబుతున్నారు.

సినిమాల కిక్...
రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు దూరం కావడం పట్ల చిరంజీవిలో కించిత్తు ఆవేదన ఉన్నట్లు అర్థమవుతోంది. ఖైదీ నెంబర్ 150 ప్రీలాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఖైదీ నెంబర్ 150ని ప్రజలు గొప్పగా ఆదరించారు. దీంతో ఆయన మరిన్ని సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా మేకింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. సినిమాలు ఇస్తున్న కిక్కు ఆయనకు మంచి అనుభూతిని ఇస్తోంది. ఈ స్థితిలో ఎంపి కావడానికి పార్టీ మారారనే ప్రచారాన్ని ఎందుకు ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications