చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ: వెంకయ్యపై చిరంజీవి
గుంటూరు: బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారారని, చంద్రబాబు చెప్పినట్టు ఆడుతూ సొంత పార్టీ కేడర్ను గందరగోళంలోకి నెట్టారని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి, కేంద్ర మంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మృతజీవి అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రాస కోసం పాకులాట తప్ప వెంకయ్యనాయుడి మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మృతజీవి కాబోదని, వాస్తవానికి తమ పార్టీ సంజీవని లాంటిదని వ్యాఖ్యానించారు. సహాయ మంత్రి చిరంజీవి అసహాయ స్థితిలో ఉన్నారని వెంకయ్య అనడాన్ని చిరంజీవి తప్పుబడుతూ తాను ఇండిపెండెంట్ చార్జితో కేంద్ర మంత్రినన్న విషయం ఆయనకు తెలియకపోవడం హాస్యాస్పదమని అన్నారు.
తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి బిజెపిని నిస్సహాయ స్థితిలోకి నెట్టిన ఘనత వెంకయ్యకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా 15సీట్లకు ఒప్పందం కుదుర్చుకొని చివరకు 13సీట్లతోనే బిజెపి వారు సరిపుచ్చుకున్నారని, అందులో కూడా టిడిపి రెబల్స్ను బాబు పరోక్షంగా రంగంలోకి దించారన్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్వార్థంతో పార్టీని వీడివెళ్లడం దురదృష్టకరమని, ఇలాంటి చర్యలు వృద్ధాప్యంలో తల్లిని రోడ్డున పడేయడం లాంటిదేనని అన్నారు. ఇలాంటి నేతలు వెళ్లిపోవడం వల్ల యువకులకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసే అవకాశం దక్కిందని, కాంగ్రెస్లో ఇదొక శుభపరిణామమని అభివర్ణించారు.
తన అనుచరులు కొందరు పార్టీని వీడివెళ్లడంపై స్పందిస్తూ వారు భవిష్యత్తు కోసమో, భయపడో వెళ్లిపోయారని, అయితే తాను వారిని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమను ప్రజలు ఆదరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీపై వారికున్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. కోట్ల రూపాయల నల్లధనం, మద్యం ప్రతిరోజూ బయటపడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్క పౌరుడిపైనా ఉందన్నారు.
కెవిపిని అరెస్ట్ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని చిరంజీవి తప్పుబట్టారు. 150కోట్ల రూపాయలకు పైగా అవకతవకలకు పాల్పడిన సుజనా చౌదరిని బాబు అరెస్ట్ చేయించగలరా అని ఎదురు ప్రశ్నించారు.