పిండాలను గోదావరిలో కలపకుండా మెట్లపై వదిలేసిన చిరంజీవి: చెత్త కుండీలో వేయించిన ఫ్యాన్స్
రాజమండ్రి: 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల్లో పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం సాంప్రదాయం. ఈ క్రుతువును శాస్త్రోక్తంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి రాజమండ్రి వీఐపీ ఘాట్లో బుధవారం పుష్కర స్నానం చేసి, పూర్వీకులకు చేసిన పిండ ప్రదానం తంతును అసంపూర్తిగా చేసి వెళ్లిపోవడంపై పూజారులు కూడా విస్తృత పోవడంతో పాటు విమర్శలకు దారి తీసింది.
సాక్షి కథనం ప్రకారం... బుధవారం మధ్యాహ్నాం 1.30 గంటల సమయంలో తన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరిష్తో కలిసి వీఐపీ ఘాట్కు చేరుకున్నారు. చిరంజీవిని చూసేందుకు అప్పటికే ఫ్యాన్స్తో పాటు, పుష్కర యాత్రికులు ఎదురు చూస్తున్నారు.

పోలీసు బందోబస్తు నడుమ ఆయన వీఐపీ ఘాట్లోకి వెళ్లి స్నానమాచరించారు. అప్పటికే ఘాట్ మెట్లపై పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేశారు. చిరంజీవి తదితరులు అక్కడకు చేరుకుని పిండప్రదానం క్రుతువు ప్రారంభించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆ తంతును ముగించేశారు.
ఈలోగా అభిమానులు, భక్తులు ఆయనను చూసేందుకు ఎగబడటంతో రద్దీ పెరిగింది. ఇంతలో చిరంజీవి పిండప్రదానంలో పిండాలను పూర్తి చేసి, వాటిని గోదావరిలో కలపకుండా మెట్లపైనే వదిలేసి వెళ్లిపోయారు. గోదావరిలో పిండాలను కలపాలని పురోహితులు సూచిస్తున్నప్పటికీ, ఆయన అక్కడ నుంచి బయల్దేరారు.

ఈ ఘటనతో అటు అభిమానులు, ఇటు పురోహితుడు విస్తుతపోయారు. దీంతో పిండాలను గోదావరిలో కలపకుండా అలా వదిలేశారేమని చిరంజీవి అభిమానులు షాక్కు గురయ్యారు. దీనిని అపచారంగా భావించిన చిరంజీవి అభిమానులు పారిశుధ్య కార్మికుల సాయంతో చిరంజీవి వదిలేసిన పిండాలను ఎత్తించి చెత్తకుండీలో వేయించారు.
ఇలా అర్ధాంతరంగా ముగించడం శాస్త్ర విరుద్ధమని పలువురు పురోహితులు చెబుతున్నారు. గోదావరిలో కలపకపోతే పిండప్రదానం పూర్తియినట్టు కాదని, ఇది ఫలితం ఇవ్వదని పేర్కొన్నారు. పుష్కర స్నానం అనంతరం చిరంజీవి విలేకర్లతో మాట్లాడుతూ పుష్కర స్నానం చేస్తే చేకూరే పుణ్యం గురించి చెప్పారు.












Click it and Unblock the Notifications