ఏపీకి ప్రత్యేక హోదాపై చిరంజీవి వ్యాఖ్యలు, బీజేపీకి సీతాదేవి రాజీనామా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందు కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి అన్నారు. 2019లో తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సహా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడిగా నియమితులైన గిడుగు రుద్రరాజు శనివారం చిరంజీవిని హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజును ఆయన అభినందించారు.
బీజేపీకి ఎర్నేని సీతాదేవి రాజీనామా
మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆమె తన రాజీనామా లేఖను అమిత్ షాకు పంపించినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మోడీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. బీజేపీ మహిళా మోర్చాలో కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సీతాదేవి 2013లో టీడీపీ నుంచి బీజేపీలో చేరారు.
జగన్ మహిళలతో తిట్టిస్తున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలతో తిట్టిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. మహిళలతో తిట్టించడం కాదని, దమ్ముంటే నేరుగా తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు దీక్షకు వచ్చిన స్పందన చూసి కొన్ని పార్టీలు కలవరపడుతున్నాయన్నారు.