సోనియాకు గంటా సవాల్: చిరంజీవికి చిక్కులు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సవాల్ విసురుతూ మంత్రి గంటా శ్రీనివాస రావు చేస్తున్న తిరుగుబాటు రాజకీయాలు, తాజాగా చేసిన ప్రకటన కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవికి చిక్కులు తెచ్చి పెట్టే పరిస్థితులను సృష్టించే అవకాశాలున్నాయి. రాజ్యసభ బరిలో తిరుగుబాటు అభ్యర్థిని దింపాలనే ప్రయత్నాలు గంటా శ్రీనివాస రావు నేతృత్వంలో జరుగతున్నాయి. ఈ స్థితిలో అధిష్టానాన్ని సవాల్ చేసే చర్యలు చిరంజీవికి కష్టాలు తెచ్చి పెడుతాయని భావిస్తున్నారు. పైగా, అన్ని వ్యవహారాలు కూడా చిరంజీవికి చెప్పే చేస్తున్నామని, చెప్పే చేస్తామని గంటా చేసిన ప్రకటన చిరంజీవిని ఇరకాటంలో పెట్టే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన తిరుగుబాటు, అసమ్మతి రాజకీయాలు చిరంజీవికి తెలిసే జరుగుతున్నాయనే అభిప్రాయం కలిగే విధంగా గంటా శ్రీనివాస రావు ప్రకటన ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యాంధ్ర తరపున బలమైన అభ్యర్థిని బరిలోకి దించబోతున్నట్టు కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. అంతేకాకుండా, తాము చేసే ప్రతి పనీ తమ నేత చిరంజీవికి చెప్పే చేస్తామని, ఇందులో ఎలాంటి భయం లేదన్నారు.
రానున్న రాజ్యసభ ఎన్నికల బరిలో సీమాంధ్ర నుంచి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఎలా ఉంటుందనే విషయంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై తన చాంబర్లో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సమావేశమై చర్చించారు.
జెసి దివాకర్ రెడ్డి, చైతన్య రాజు లేదా తాను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు. అయితే చిరంజీవితో మాట్లాడాకే తుది నిర్ణయం తీసుకుంటామని, ఏ విషమైనా ఆయనకు చెప్పే చేస్తానని తెలిపారు. గంటా శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై అధిష్టానం పెద్దలు చిరంజీవి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.0
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు కిరణ్ దూరం
రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు తెలంగాణ బిల్లుపై చర్చ, తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
ఇదే విషయాన్ని కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు కూడా. అయితే, శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చకొనసాగుతున్నందున తాను ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి రాలేనని ఆయన దిగ్విజయ్ సింగ్కు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం అనుకున్నట్టుగానే శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.