వైపరీత్యాన్ని ఆపలేం, కానీ: బాబు ప్రభుత్వానికి చిరంజీవి
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేమని, దాని వల్ల దెబ్బతిన్న బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి ప్రభుత్వానికి శనివారం విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లా ఎల్లపువానిపాలెంలో పర్యటించారు.
ఆయనతో పాటు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఎంపీ సుబ్బిరామి రెడ్డి తదితరులు ఉన్నారు. బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. బాధితులను గుర్తించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. బాధితుల గుర్తింపు వేగవంతం చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

కాగా, తుఫాను తాకిడికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఎంపి ల్యాడ్స్ కింద 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చిరంజీవి నాలుగు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని మెగా ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. చిరంజీవి 19, 20 తేదీల్లో తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
వ్యాధుల ముప్పు
హుధుద్ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖ ప్రజానీకానికి మరో అంశం భయాందోళనలు కలిగిస్తోంది. తుపానుతో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర విఘాతమేర్పడగా, ఇప్పటికీ పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరగటంలేదు. ప్రభుత్వ పరంగా అరకొరగా సరఫరా జరిగిన నీటినే వాడుకుంటూ వచ్చారు.
తాజాగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గత ఆదివారం నాటి పెనుగాలుల తాకిడికి కూలిన చెట్లకు సంబంధించి కొమ్మలను నరికి రోడ్డు పక్కనే పడేశారు. ఇంకా వీటిని డంపింగ్ యార్డులకు తరలించలేదు. వాహనాలు, సిబ్బంది కొరత కారణంగా చెత్త తరలింపు ఆశించినంత వేగంగా సాగట్లేదు. చెట్ల కొమ్మలతో పాటు నిత్యం పోగయ్యే వ్యర్థాలు రోడ్ల పక్కన కుప్పలుగా పేరుకుపోయాయి.
దీంతో గత మూడు రోజులుగా నగరంలో దోమల బెడద అధికమైంది. తుపాను తదనంతరం ఐదు రోజుల పాటు ఎండలు విపరీతంగా పెరగడంతో చెత్తసమస్యపై దృష్టి పడలేదు. తాజాగా వర్షాలు కురుస్తుండటంతో చెత్త కుళ్లి వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే నగరంలో రోజుకు 1000 టన్నుల చెత్త పోగవుతుంది. ఇది జివిఎంసి అధికారికంగా ప్రకటించిన లెక్క. గత వారం రోజులుగా తడి, పొడి చెత్త సేకరణ మరుగున పడిపోవడంతో చెత్త మొత్తం రోడ్లపైకి వచ్చి చేరుతోంది.
దీనికి తోడు చెట్లు కూలిపోవడంతో వేల టన్నుల చెత్త దీనికి తోడైంది. పూర్తి స్థాయిలో చెత్తను తరలించలేక యంత్రాంగం అవస్థలు పడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాలువలు పూడుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు వస్తున్నాయి.విశాఖలో దాదాపు 50 శాతం ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో దోమల నుంచి రక్షణకు ప్రజలు పడుతున్న బాధలు చెప్పనలవి కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనితీరు, పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు సైతం తుపాను బాధితులకు ఇచ్చే పరిహారం, సహాయం కోసం క్యూకడుతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడ పడకేశాయి. తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహంచాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications