అనుభవించారు: పురంధేశ్వరిపై చిరు, కిరణ్ వార్నింగ్
విశాఖపట్నం/ విజయవాడ: తమ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై కాంగ్రెసు సీమాంధ్ర ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవి తీవ్రంగా మండిపడ్డారు. రెండు సార్లు మంత్రి పదవి అనుభవించి పురంధేశ్వరి పార్టీ మారారని ఆయన అన్నారు. పార్టీ బస్సుయాత్రలో శనివారం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
పురంధేశ్వరి సమైక్యవాది అయితే విభజన పార్టీ బిజెపిలో ఎలా చేరారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా కేంద్రం న్యాయం చేసిందని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయని ఆయన అన్నారు. పదవులు అనుభవించినవారు పార్టీని వదిలిపోయారని ఆయన అన్నారు. నాయకులు వీడినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని ఆయన అన్నారు. అధికార దాహంతోనే వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఏర్పాటు చేశారని ఆయన విమర్సించారు.

తనపై విమర్శలు చేసిన చిరంజీవిని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తాను నోరు తెరిస్తే చిరంజీవి పారిపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలోని పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన శనివారం రోడ్ షో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాగితంపై రాసుకొచ్చి చదివిన చిరంజీవికి తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సీమాంధ్రులు తలుచుకుంటే తెలంగాణకు నీళ్లు రాకుండా ఆపగలరని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లు తలుచుకున్నా సీమాంధ్రకు నీళ్లు రాకుండా ఆపలేరని ఆయన అన్నారు. హైదరాబాదును సీమాంధ్రులే అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు. దమ్ముంటే చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయాలని హర్షకుమార్ సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications