ఓటమి: సోనియా ఎదుట పవన్ పేరు చెప్పిన చిరంజీవి!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తోడయిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డిలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు చెప్పినట్లుగా సమాచారం.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ హవా దేశవ్యాప్తంగా వీచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ హవా ఎపికి కూడా తాకిందని అటు అధిష్టానం రాష్ట్ర నేతలను ఓదార్చే ప్రయత్నం చేశారట. దానికి చిరు, రఘువీరాలు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి చేసిన ప్రచారం కొసమెరుపులా పని చేసిందని వారు రాహుల్, సోనియాలకు చెప్పారట. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి గల కారణాలను వారు ఓ నివేదికలో పొందుపరిచి అందజేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెసు జీరో అవుతుందంటూ మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి మొదలు పెట్టిన ప్రచారం తీవ్రంగా నష్టపరిచిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. పదేళ్ల సుదీర్ఘ పాలన వల్ల ప్రజల్లో అసంతృప్తి, ధరల పెరుగుదల, గ్యాస్-ఆధార్ అనుసంధానంలో అయోమయం కూడా పార్టీని దెబ్బతీసినట్లుగా వారు చెప్పారు.