ఎవ్వరినీ వదలరు: హత్యపై లోకేష్, అనురాధ వర్గం దాడులు, చింటుపై పోలీసుల ఆరా
విజయవాడ: తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ మృతి పైన టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం స్పందించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త కటారి మోహన్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆమెపై దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. నిందితులు ఎంతటి వారైనా చట్టాలు వదిలి పెట్టవన్నారు. లొంగిపోయిన నిందితుల నుంచి దాడికి సూత్రధారులు ఎవరన్న విషయాన్ని పోలీసులు తేలుస్తారన్నారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మేయర్ అనురాధ హత్యను నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు.
ఇదిలా ఉండగా, అనురాధను పక్కా ప్లాన్తో హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రెండు వారాల పాటు రెక్కీ వేశారు. మంగళవారం దాడి సమయంలో కార్యాలయంలోని సిసి కెమెరాలు పని చేయడం లేదని తెలుస్తోంది. హత్య విషయమై పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు.
జాగిలాలు ప్రాథమిక సాక్ష్యాలను అందించాయి. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి బయలుదేరిన శునకాలు నేరుగా కఠారి మోహన్ మేనల్లుడు చింటు కార్యాలయానికి, ఆపై ఇంటి వైపు వెళ్లాయని తెలుస్తోంది. దీంతో హత్యకు ముందు లేదా ఆ తర్వాత దుండగులు చింటు కార్యాలయానికి వచ్చి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
ప్రతీకార దాడులు
నగర మేయర్ కటారి అనురాధ హత్య నేపథ్యంలో ఆమె అనుచరులు రగిలిపోతున్నారు. దీంతో, అనుమానితుల పైన ప్రతికార దాడులకు దిగుతున్నారు. కటారి మేనల్లుడు చింటు (చంద్రశేఖర్) కార్యాలయంపై మేయర్ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు.
కార్యాలయం ఎదుట ఉన్న రెండు బైకులు, జీపులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇదిలా ఉండగా, చింటు ఎక్కడున్నాడో తెలియదని, ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. లొంగిపోయిన వారి నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన సమయంలో మేయర్, ఆమె భర్త, ముగ్గురు కార్పోరేటర్లు కార్యాలయంలో ఉన్నారు.