ఏపీకి హోదా: చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కొత్త వేషం ఇదే
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఢిల్లీలో టీడీపీ ఎంపీల నిరసనను కొనసాగించారు. టీడీపీ ఎంపీల్లో ఆయన శైలి వినూత్నం.
ఎప్పడూ వింత వేషధరాణలతో ఆకట్టుకునే టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో కొత్త వేషం వేశారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ ఆవరణలో తప్పెటగుళ్ల వేషధారణలో లోక్సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కళాకారుడునని, ఆ విధంగానే తన నిరసనను తెలియజేస్తానని చెప్పారు. ఈరోజు తాను వేసుకొచ్చిన వేషం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎంతో ఫేమస్ అని పేర్కొన్నారు. విభజన బిల్లు సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రుల సెంటిమెంట్ను తక్కువగా అంచనావేయెద్దని కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. ఈ సందర్భంగా తప్పెటగుళ్ల వేషధారులు పాట తరహాలో ఓ పాట పాడి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.