90 కెజీల గోల్డ్, 131 కోట్లు సీజ్: డిజిపి, పోలింగ్కు భద్రత
హైదరాబాద్: సీమాంధ్రలోని 13 జిల్లాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డిజిపి ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 22వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లును కూడా సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.
72 వేల మంది సివిల్ పోలీసులు, 284 పారామిలిటరీ, 69 ఏపిఎస్పి బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5,938 కేసులు నమోదయ్యాయని డిజిపి తెలిపారు. 29,675 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు రూ. 131 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి ప్రసాదరావు తెలిపారు. 33 లక్షల సీసాల మధ్యం సీజ్ చేసినట్లు చెప్పారు. 90 కిలోల బంగారం, 825 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాదరావు తెలిపారు. మావోయిస్టుల ఆగడాలను అడ్డుకునేందుకు కౌంటర్ పార్టీని కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.