కార్మికుడికి చిత్రహింసలు: సిఐ, కానిస్టేబుళ్లకు జైలు శిక్ష
కాకినాడ: ఇటుకల బట్టీ యజమాని ప్రోద్బలంతో బట్టీలో పనిచేసే ఒక కార్మికుడిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఒక ఎస్సై (ప్రస్తుతం సిఐ) ఇద్దరు కానిస్టేబుళ్లకు మూడేళ్ల వంతున జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు కోర్టు సోమవారం సంచలన తీర్పుచెప్పింది. వీరితోపాటు ఇటుకల బట్టీ యజమానికి కూడా జైలుశిక్ష, జరిమానా విధించారు.
ఆలమూరు మండల కేంద్రం ఆలమూరుకు చెందిన నక్కా లక్ష్మణరావు అదే గ్రామానికి చెందిన చల్లా ప్రభాకరరావు అనే వ్యక్తి ఇటుకల బట్టీలో కార్మికునిగా పనిచేసేవాడు. యజమాని ప్రభాకరరావు వద్ద లక్ష్మణరావు రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత లక్ష్మణరావు ఆ బాకీ తీర్చేశాడు. అయినా బట్టీ యజమాని ప్రభాకరరావు ప్రోద్బలంతో అప్పటి ఆలమూరు ఎస్సై ఎల్ రవితేజ, కానిస్టేబుళ్లు కొండలరావు, కృష్ణారెడ్డి లక్ష్మణరావును నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారు.
దానిపై లక్షణరావు తల్లి మంగమ్మ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి, విచారణకు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. దీనిపై వివిధ సెక్షన్ల కింద ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇటుకల బట్టీ యజమానిపై కేసు నమోదయ్యింది.
ఈ కేసులో నేరం రుజువు కావడంతో మొదటి నిందితుడైన ఇటుకల బట్టీ యజమాని ప్రభాకరరావుకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11,500 జరిమానా, రెండు, మూడు, నాలుగో నిందితులుగా ఉన్న ఎస్సై రవితేజ, కానిస్టేబుళ్లు కొండలరావు, కృష్ణారెడ్డికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6,500 వంతున జరిమానా విధిస్తూ ఆలమూరు అడిషినల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.సుబ్బారావు సోమవారం తీర్పుచెప్పారు.
నిందితులకు అప్పీలు చేసుకోవడానికి వీలుగా బెయిలు మంజూరైంది. బాధితుని తరపున మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు వాదించగా, ఆయనకు ఆలమూరుకు చెందిన సమతా స్వచ్చంద సంస్ధకు చెందిన ప్రతినిధులు సహకరించారు. కాగా ఈ ఘటన 2002లో జరిగింది. అప్పటి ఎస్సై రవితేజ ప్రస్తుతం రాజమండ్రిలో ఇన్స్పెక్టర్గా పనిస్తుండగా, కొండలరావు హెడ్కానిస్టేబుల్గా, కృష్ణారెడ్డి కాకినాడలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.