సీఎం జగన్-మెగాస్టార్ భేటీకి బ్రేకులు ఎక్కడ : సాయిరెడ్డితో చిరు ఏం చెప్పారు : ఓపెన్ ఆ వ్యాఖ్యల వెనుక..!!
ముఖ్యమంత్రి జగన్...మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో సినీ పెద్దల సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది. గత నెలలో జరగాల్సిన సమావేశం ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు. ఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యల మీద ఇప్పటికే మెగాస్టార్ టీం సీఎం జగన్ ను కలిసింది. ఆ సమయంలో ప్రస్తావించిన అంశాల పైన తాము సానుకూలంగా స్పందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే చిరంజీవి రెండు సార్లు సీఎం జగన్ ను కలిసారు. తొలి సారి కలిసిన సమయంలోనే పరిశ్రమ అంశాలను ప్రస్తావించగా..మీరే లీడ్ తీసుకొని పరిశ్రమలోని పెద్దలను తీసుకురండి..ఖచ్చితంగా పరిష్కరిద్దాం...అంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు.
చిరంజీవి టీం సీఎంను కలిసిన సమయంలో
అదే విధంగా చిరంజీవి..నాగార్జున..దిల్ రాజ్..రాజమౌళి..సీ కళ్యాణ్..సురేష్ బాబు మరో సారి సీఎంతో భేటీ అయి కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత ప్రభుత్వం కొన్నింటిని అమలు చేస్తూ జీవోలు ఇచ్చింది. కరోనా తరువాత.. మిగిలిన అంశాల పైన సీఎం జగన్ తో చర్చించేందుకు చిరంజీవి టీం గత నెల రోజులుగా సీఎంతో చర్చలు ఉంటాయని చెబుతూ వచ్చింది. తమ సమస్యలను సీఎం కు వివరించేందుకు సినీ పెద్దలు సమయం కోరారు. మొదట విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని కలిసి సమస్యలను తెలియజేశారు.
సినీ నిర్మాతలతో ప్రభుత్వం సమావేశం
ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్తో మాట్లాడేందుకు చిరంజీవితో పాటు మరికొందరని ఆహ్వానించినట్లుగా ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పేర్ని నాని ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత చిరంజీవి.. సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లను పిలిచి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు చిరు రెడీ అవుతున్న సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఈ అంశం పైన ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఆన్ లైన్ టిక్కెట్లకు అంగీకారం
అయితే, ఇండస్ట్రీ నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందనే విషయం ప్రభుత్వమే వెల్లడించే వరకూ చిరంజీవి టీంలోని ఎవరూ ప్రభుత్వానికి మద్దతుగా రాకపోవటం పైన ప్రభుత్వంలోని ముఖ్యులు కొంత నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆ తరువాత మంత్రి పేర్ని నాని ఈ ప్రతిపాదన చిరంజీవి టీం నుంచే వచ్చిందని తేల్చి చెప్పారు. ఇక, ఈ అంశం పైన ముందుగా చర్చించేందుకు టాలీవుడ్కి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.. పేర్ని నానితో సమావేశమై చర్చలు నిర్వహించారు. తామే ఈ ప్రతిపాదన చేసామంటూ..తమకు ఆన్ లైన్ విధానం ఆమోదయోగ్యమైనదే అంటూ వారు స్పష్టం చేసారు.
సీఎం జగన్ కు చిరంజీవి ఓపెన్ అప్పీల్ ఎందుకు
ఇక, ఈ సమావేశానికి ముందు రోజు (ఆదివారం) ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. సినీ ఇండస్ట్రీలో నలుగురు లేదా అయిదుగురు హీరోల రెమ్యునరేషన్ మాత్రమే భారీగా ఉందని..మిగిలిన వారిని అదే రకంగా చూడవద్దని కోరారు. సినిమాలు పూర్తి చేసినా..విడుదల చేస్తే రెవిన్యూ వస్తుందా లేదా అనే మీమాంసతో విడుదల చేయకుండా నిలిచిపోయానని చెప్పుకొచ్చారు. తన మూవీ ఆచార్య సైతం విడుదలకు రెడీగా ఉందని...కానీ, రెవిన్యూ అంచనాలు అందక విడుదల తేదీ ఖరారు చేయలేదని చెప్పుకొచ్చారు.
త్వరలోనే భేటీ ఉంటుందంటూ సమాచారం
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాము ఇప్పటికే కొన్ని అంశాలను ప్రభుత్వానికి నివేదించామని గుర్తు చేసారు. జగన్ గారు...సమస్యలను పరిష్కరించమని కోరుతున్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక, ఈ రోజు సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఆన్ లైన్ టిక్కెట్ల విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేసారు. మరో విడత సినీ ప్రముఖులతో చర్చిస్తామని వెల్లడించారు. వారితోనూ చర్చించిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో సీఎం వద్ద చర్చించి తుది కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు.
చిరంజీవి అంటే జగన్ కు అభిమానమే అంటూ..
ఇదే సమయంలో చిరంజీవి అంటే సీఎం జగన్ కు గౌరవమని..సోదర భావంతో చూస్తారని మంత్రి పేర్ని నాని వివరించారు. ఇక, ప్రభుత్వ సమావేశానికి హాజరైన నిర్మాతలు సైతం ఆన్ లైన్ టిక్కెట్ విధానానికి మద్దతు ప్రకటించారు. దీంతో..పేర్ని నాని గతంలో చెప్పిన విధంగా చిరంజీవి టీం ఎప్పుడు సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.